ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని.. కొత్త నాయకుడిని ఎన్నుకున్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాయకుడిని అసెంబ్లీ సెక్రటేరియట్ అధిపతి ప్రకటించనున్నారు. అధికారికంగా పేరుబయట పెట్టకపోయినప్పటికీ ఖమేనీ కుమారుడు మజ్తబానే కొత్తనాయకుడంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
వారసత్వ నాయకత్వంపై అసెంబ్లీలో కొంతమంది సభ్యుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే కొత్త నాయకుడి ప్రకటన జాప్యం అవుతుందని సమాచారం. కొత్త నాయకుడిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నందున.. కొత్త నాయకుడి పేరు ప్రకటించే లోపు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరు? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఖమేనీ తన జీవితకాలంలో ఎవరినీ అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, కొత్త సుప్రీం లీడర్ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రేణి మత పండితులు ఉంటారు. వీరు చర్చించి కొత్త నేతను ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పాత్ర ఇందులో అత్యంత కీలకం. దేశంలో అత్యంత శక్తివంతమైన ఈ సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.


