అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న ఇరాన్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన షిప్పై సబ్ మెరైన్ అటాక్ జరిగింది. దీంతో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 101 మంది గల్లంతు కాగా మరో 74 మంది గాయపడ్డట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. అయితే ఈ దాడి ఎవరు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం పశ్చిమాసియాను యుద్ధం కమ్ముకుంది. టెహ్రాన్పై యుఎస్, ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు తెగబడుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఆ నగరం విధ్వంసమైంది. ఆ దేశానికి చెందిన అనేక భవనాలు నేల కూలాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇరాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రాడార్ సిస్టమ్స్ ఇలా అన్నింటిని నిర్వర్యం చేశామని తెలిపారు. ఇలా దాడులతో ఇప్పటికే పెద్దఎత్తున సైనికవ్యవస్థ దెబ్బతిన్న ఇరాన్కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది.
శ్రీలంక గాలే నగర తీరంలో ఇరాన్కు చెందిన ఐరిస్ డెనా అనే యుద్ధనౌకపైపై సబ్ మెరైన్ అటాక్ జరిగింది. దీంతో నౌక ప్రమాదానికి గురై సముద్రంలోకి మునిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో నౌక నుంచి ప్రమాద సంకేతాలు రావడంతో శ్రీలంక నావికాదళం వెంటనే అక్కడికి చేరుకుంది. తక్షణమే స్పందించి ప్రమాదంలో మునిగిపోతున్న దాదాపు 30 మందిని సురక్షితంగా కాపాడాయి. అనంతరం గాయపడిన 78 మందిని స్థానికంగా గల గాలె ఆస్పత్రికి తరలించారు. కాగా గల్లంతైన వారికోసం గాలింపులు చేపడుతున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ ప్రకటించారు.
అయితే ఈ నౌక ఐరిస్ డెనా నౌక గత నెల 17న విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూలో (IFR)పాల్గొని తిరిగి ఇరాన్ వెళుతుండగా దాడి జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఈ ప్రమాదం అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ నౌకపై ఎవరు దాడి చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.


