కోలాహలం.. శివోత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా సాగింది. స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు, పితృదేవలకు తర్పణం అర్పించే భక్తులు, శంఖం పూరించే జంగమ దేవరలు, ముక్కంటి దర్శనం కోసం పురవీధుల్లో జనం పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని వాయులింగేశ్వరుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం వేకువజామున 2గంటలకే ఆలయ అర్చకులు పవిత్ర మంత్రోచ్ఛారణ చేస్తూ స్వామి, అమ్మవార్లను పళ్లియరతో మేల్కొలిపారు. అనంతరం గోపూజ నిర్వహించారు. సుప్రభాత సేవ తరువాత స్వామి అమ్మవార్ల సర్వదర్శనానికి 3 గంటలకు అనుమతించారు. ఉదయం 5 నుంచి 10.30 గంటల మధ్య స్వామి, అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. రుద్రాభిషేకంతో పాటు క్షీరాభిషేకం పచ్చ కర్పూరాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా వివిధ రకాల అభిషేకాలు చేశారు.వేకువజాము 2 గంటల నుంచే స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రాజగోపురం సమీపం నుంచి సామాన్య భక్తుల కోసం ఉచిత దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల మహాలఘుదర్శనం కల్పించారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వరుడు ఇంద్ర విమానంపై పురవీధుల్లో ఊరేగారు. స్వామివారి దేవేరి జ్ఞానప్రసూనాంబ చప్పరంపై అధిష్టించి అనుసరించారు. వేలాది మంది భక్తులు కర్పూర హార తులు పట్టి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
కోలాహలం.. శివోత్సవం


