కారైక్కాల్కు అమిత్ షా
సాక్షి, చైన్నె: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోమారు తమిళనాడు పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 13న ఆయన తిరుచ్చికి రానున్నారు. 14వ తేదీన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్లో జరిగిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. వివరాలు.. తమిళనాడులో డీఎంకే గద్దె దించి తీరుతానన్న సంకల్పంతో అమిత్ షా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే, బీజేపీ నేతృత్వంలో బలమైన కూటమి దిశగా కసరత్తు వేగవంతం చేశారు. గత నెల ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కూటమి నేతలందరూ ఒకే వేదిక మీదకు వచ్చారు. అయినా, ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే నుంచి సమాధానం కరువు కావడంతో చివరకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. గత రెండు రోజులుగా కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ డీఎండీకే వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇది ఒకటి రెండు రోజులలో ఫలితాన్ని ఇవ్వనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో తిరుచ్చి పర్యటనకు వస్తున్న అమిత్షాతో ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే వర్గాలను సమావేశ పరిచే దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో అమిత్ షా పర్యటన ఖారారు కావడంతో ఏర్పాట్లు వేగవంతం చేశారు.
13న తిరుచ్చికి రాక
అమిత్ షా 13వ తేదీన తిరుచ్చికి రానున్నారు. ఇక్కడ పార్టీ వర్గాలతో సమావేశం అవుతారు. మరుసటిరోజు 14న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్లో జరిగిన ఎన్డీఏ కూటమిబహిరంగ సభకు హాజరు కానున్నారు. తిరుచ్చి నుంచి హెలికాఫ్టర్లో పుదుచ్చేరి వెళ్తారు. పుదుచ్చేరిలోని ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి నేతలందర్నీ అమిత్షా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి పరిచయం చేయనున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరుచ్చికి తిరుగు పయనం అవుతారు. ఇక్కడ కేంద్ర మంత్రి, బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తదితర నిర్వాహకులతో సమావేశం కానున్నారు.


