రామేశ్వరంలో విమానాశ్రయం
సాక్షి, చైన్నె: రామేశ్వరం శ్రీరామనాథ స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం విమానాశ్రయం ఏర్పాటు కానున్నది. ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదిక సన్నద్ధం చేశారు. రామనాథపురం జిల్లా రామేశ్వరంలో రామనాథ స్వామివారు కొలువై ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి పవిత్ర తీర్థాలలో నిత్యం భక్తులు స్నానాల నిమిత్తం తరలివస్తున్నారు. రామేశ్వరం, ధనుష్కోటి, అరిచల్ దీవుల సందర్శనార్థం నిత్యం సందర్శకులు వస్తుంటారు. రామేశ్వరం వెళ్లాలంటే మదురై విమానాశ్రయంలో దిగి, రోడ్డు మార్గంలో పయనించాల్సి ఉంది. రామేశ్వరానికి నిత్యం పెరుగుతున్న భక్తుల తాకిడి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం రోడ్డు రవాణా సమస్యను పరిష్కరించడానికి రామేశ్వరం ప్రాంతంలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్ట్ కోసం 2025 బడ్జెట్లో అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ కొత్త విమానాశ్రయం స్థానిక రవాణాను వేగవంతం చేయడం, సముద్ర ఆహార పదార్థాల ఎగుమతిని పెంచడం తదితర వ్యాపార అవకాశాలను కూడా కల్పిస్తుందని నిర్ణయించారు.
నివేదిక సిద్ధం
టిడ్కో(తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ) రామనాథపురంలోని పాలంకుళం, దేవిపట్నం, కుంబరం, కలరి, మణిక్కనేరి ప్రాంతాలలో 500 ఎకరాల భూమిని సేకరించింది. వీటిలో తక్కువ జనసంఖ్య ఉన్న కుంబరం, మణిక్కనేరి ప్రాంతాలను ప్రాధాన్యంగా పరిశీలనలోకి తీసుకుని ఉన్నారు. గత సంవత్సరం చివరిలో సర్వే నిర్వహించి, తాజాగా నివేదికను సిద్ధం చేశారు. దీనిని తమిళనాడు ప్రభుత్వం పరిశీలనకు పంపించారు. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం, మణిక్కనేరి ప్రాంతం సాంకేతికంగా విమానాశ్రయం ఏర్పాటు కోసం అనుకూలంగా ఉన్నట్టు పరిగణించారు. విమానాశ్రయం నిర్మాణానికి అనుమతులు కేంద్ర ప్రభుత్వం, భారత విమానాశ్రయాల అథారిటీ నుండి పొందిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.


