మరో 1000 ఆలయాలకు విస్తరణ
సాక్షి, చైన్నె : తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకకాల పూజ పథకంను మరింతగా విస్తరించారు. ఈ పథకంలో భాగంగా హిందూ ధర్మాదాయ శాఖ పరిధిలోని మరో 1,000 ఆర్థికంగా వెనుకబడిన ఆలయాలను చేర్చారు. వీటికి రూ. 25 కోట్ల నిధులను కేటాయించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను శనివారం సీఎం స్టాలిన్ సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ పథకం పరిధిలో తాజాగా లబ్ధి పొందుతున్న ఆలయాల సంఖ్యం 19 వేలకు చేరింది. ప్రతి ఆలయానికి డిపాజిట్ మొత్తాన్ని రూ. 2 నుంచి రూ. 2.50 లక్షలకు పెంచారు. పూజా ఖర్చులను ఆ డిపాజిట్పై వచ్చే వడ్డీని ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే, ఈ 19 వేల ఆలయాలకు రూ. రూ.8.58 కోట్ల వ్యయంతో పూజా సామగ్రి పంపిణీ చేశారు. ఇందులో ఇత్తడి తాంబూలం తట్ట, గంట, కామాక్షి దీపం, పంచపాత్రం తదితర సామగ్రిని దేవాలయాల పూజారులకు అందించారు. అదనంగా దేవాలయాల విద్యుత్ బిల్లుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది.
పూజారులకు ప్రోత్సాహకం పెంపు
ఆలయాలలో పనిచేసే పూజారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది వరకు నెల వారీ ప్రోత్సాహం రూ. 1000 అందజేస్తూ వచ్చారు. తాజాగా ఈ మొత్తాన్ని రూ.1500లకు పెంచారు. వేలాది మంది పూజారులకు ఈ పెంపు ప్రయోజనం కలిగించనున్నది. ఇందులో పది మందికి సీఎం స్టాలిన్ పెంపునకు సంబంధించిన చెక్కులను సీఎం అందజేశారు. తమిళనాడు ప్రభుత్వం పురాతన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో పలు మ్యూజియంలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శివగంగ జిల్లాలో రూ.24.30 కోట్ల వ్యయంతో నిర్మించిన కీలాడి ఓపెన్ ఎయిర్ మ్యూజియాన్ని సీఎం స్టాలిన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. సంగ కాల యుగ నాగరికతకు చెందిన తవ్వకాలలో బయట పడ్డ ఆధారాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఈ మ్యూజియాన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. అలాగే, తంజావూరు జిల్లాలోని మనోరా స్మారక చిహ్నంలో రూ.2.75 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఆధునిక లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈరోడ్ జిల్లాలో రూ.33.19 కోట్లతో నోయ్యాల్ మ్యూజియం, రామనాథపురం జిల్లాలో రూ.34.55 కోట్లతో నవాయి మ్యూజియం నిర్మాణానికి సీఎం స్టాలిన్ ఈసందర్భంగా శంకుస్థాపన చేశారు. తంజావూరులోని తమిళ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రూ.56.41 కోట్ల వ్యయంతో గ్రేట్ చోళ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. చోళుల పరిపాలన, కళా వైభవం, నావికాదళ శక్తి వంటి అంశాలపై ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు.
సీఎం స్టాలిన్కు మహిళల బ్రహ్మరథం
ఆలయ నిధులకు సంబంధించిన చెక్కు అందజేస్తున్న సీఎం స్టాలిన్
బ్రహ్మరథం
చైన్నె నుంచి బృందావన్ ఎక్స్ప్రెస్లో జోలార్ పేటకు సీఎం స్టాలిన్ వెళ్లారు. ఆయనకు అరక్కోణం, జోలార్ పేట స్టేషన్లలో ఘన స్వాగతం లభించింది. తిరుపత్తూరులో రూ. 15 కోట్లతో నిర్మిస్తున్న క్రీడా సముదాయంను సీఎం పరిశీలించారు. కాగా, పెద్దఎత్తున మహిళా లోకం దారి పొడవున సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశాయి. తమకు అందిన రూ. 5 వేలు నగదును చూపిస్తూ, ఆనందంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
మరో 1000 ఆలయాలకు విస్తరణ


