వైభవంగా పద్మావతి అమ్మవారి రథోత్సవం
కొరుక్కుపేట: చైన్నె, టి.నగర్ జీఎన్ చెట్టిరోడ్డులో కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం ఉదయం రథోత్సవం వైభవంగా సాగింది. ఆలయ ప్రాంగణం చుట్టూ సాగిన రథోత్సవం కనుల పండువుగా నిలిచింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ఆలయ ప్రధానార్చకులు, వైష్ణవ పండితుల మంత్రోచ్చారణలతో పూజలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అదేవిధంగా ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నేత్ర పర్వంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం పై వేంచేపు చేసి ఊరేగించారు. ఆ సమయంలో భక్తులు గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణలతో స్వామిని సేవించారు. ఈ వేడుకల్లో ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధనుంజయ్, సూపరింటెండెంట్ పుష్పలత, టీటీడీ స్థానిక సలహా మండలి మాజీ అధ్యక్షులు ఎన్. శ్రీకృష్ణ, మాజీ సభ్యులు రవిబాబు, మోహన్ రావు, రంగారెడ్డి, జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.


