రంగంలోకి వేణుగోపాల్
సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలోని టీఎన్సీసీ నేతలు తలా ఓ దారిలో చేస్తున్న మాటలు రచ్చకెక్కిన నేపథ్యంలో సీట్ల పందేరం వ్యవహారంగా చర్చలకు ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ను ఏఐసీసీ రంగంలోకి దించింది. ఈయన 17వ తేదీన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్లోని కొందరు ఏఐసీసీ నేతలు, టీఎన్సీసీకి చెందిన మరి కొందరు నేతలు చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు కూటమిలో కొత్త చిక్కులు బయలు దేరినట్లయ్యింది. టీవీకే అధినేత విజయ్కు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు ఉండటాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. దీంతో పార్టీ పార్లమెంటరీ నేత, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళిని రంగంలోకి దించారు. ఆమె గత నెల ఢిల్లీలో ఏఐసీసీ నేత రాహుల్ గాంఽధీతో గంటన్నర పాటుగా సమావేశమయ్యారు. ఈ భేటీ తదుపరి డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతున్న సమాచారం వెలువడింది. అయితే సీట్ల పందేరాన్ని డీఎంకే నాన్చుడు ధోరణిలో పడేసింది. ఇది కాంగ్రెస్లో అసంతృప్తిని రగిల్చినట్లయ్యింది. ఎంపీ మాణిక్యం ఠాకూర్ వంటి నేతలు బహిరంగంగానే అధికారంలో వాటా, అధిక సీట్లు అంటూ స్పందిస్తుండడం డీఎంకేకు పుండు మీద కారంచల్లినట్లయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకేతో పొత్తు, సీట్ల పందేరం చర్చను కొలిక్కి తెచ్చేందుకు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ను ఏఐసీసీ పెద్దలు రంగంలోకి దించారు. గత వారం ఢిల్లీలో తమిళనాడు కాంగ్రెస్ నేతలతో జరిగిన భేటీ మేరకు తదుపరి అడుగులు కేసీ వేణుగోపాల్ ద్వారా వేయించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీన చైన్నెకు వచ్చే ఆయన ఇక్కడి పార్టీ వర్గాలతో సమావేశం కానున్నారు. అలాగే పుదుచ్చేరిలోని కాంగ్రెస్ వర్గాలతోనూ సమావేశం కానున్నడం తో డీఎంకేతో సీట్ల పందేరం కొలిక్కి వచ్చేనా, లేదా మళ్లీ నాన్చుడేనా..? అన్నది వేచి చూడాల్సిందే.


