అధికారంలో వాటా ఇవ్వాల్సిందే..!
– ఎంపీ మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్యల చర్చ
సాక్షి, చైన్నె: తాము డీఎంకేను ఆస్తి పాస్తులు అడగడం లేదని, మర్యాద ఇవ్వాలని కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక ఆయన నేతృత్వంలో జరిగిన మదురై పార్టీ సమావేశంలో టీవీకేతో పొత్తు పెట్టుకుందామని నేతలు బహిరంగంగా నినాదించడం గమనార్హం. వివరాలు.. తమ బంధం బలంగానే ఉందంటూ డీఎంకే, కాంగ్రెస్లు ౖపైపెకి చెప్పుకుంటున్నా, లోలోపల రెండు పార్టీల మధ్య సమరం సాగుతుండటం తాజాగా స్పష్టమవుతోంది. తమకు సీట్ల పంపకాలను తేల్చాలంటూ కాంగ్రెస్ కమిటీ డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ను కలిసి విన్నవించి రెండున్నర నెలలు అవుతోంది. ఇంత వరకు డీఎంకే ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోలేదు. అదే సమయంలో విజయ్ టీవీకే తో పొత్తు అన్నట్టుగా టీఎన్సీసీ నేతలు అనేక మంది పెదవి విప్పుతుండటం చర్చకు దారి తీశాయి. కొందరు అయితే, తమకు ఈ సారి అధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని డీఎంకేను డిమాండ్ చేసే పనిలో పడ్డారు. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అని ఏఐసీసీ నుంచి హెచ్చరికలు టీఎన్సీసీ వర్గాలకు వస్తున్నా, ఇక్కడి నాయకులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందులో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ముందంజలో ఉన్నారు.
పొత్తు వద్దు..
మదురైలో ఆదివారం మాణిక్యం ఠాకూర్ నేతృత్వంలో దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల కాంగ్రెస్ నిర్వాహకుల సమావేశం జరిగింది. ఇందులో మాట్లాడిన నేతలందూరు బహిరంగంగానే డీఎంకేతో పొత్తు వద్దే వద్దని నినాదించారు. టీవీకేతో పొత్తు పెట్టుకుందామని యువత ఆశిస్తున్నట్టు వివరించారు. విజయ్ సీఎం కావాలని, అప్పుడే అన్ని పార్టీలకు అధికారంలో వాటా అన్నది దక్కుతుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఎంపీ మాణిక్యం ఠాకూర్ అయితే మరింతగా డీఎంకే పై విరుచుకుపడ్డారు. తాము డీఎంకేను ఆస్తి పాస్తులు ఇవ్వాలని అడగడం లేదని.. కనీసం మిత్రులకు ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇవ్వడం అలవాటు చేసుకోండి అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ను కించపరిచే వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత మదురై దళపతిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో అని ప్రశ్నించారు. అధికారంలో వాటా ఈసారి ఇవ్వాల్సిందేనని, తమకు కావాల్సిన స్థానాలు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు. తనకు ఎంపీ పదవి ముఖ్యం కాదని, తనకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ అనురాగాన్ని కించ పరిస్తే సహించబోమని, డీఎంకే చేసిన తప్పులను కాంగ్రెస్ భుజాన మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విరుచుకు పడ్డారు. ఆయన ఈ విధంగా తీవ్రంగా విరుచుకు పడితే, ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవరి అయితే, రూ. 5 వేలు బ్యాంక్ ఖాతాలో వేసినంత మాత్రాన గెలుపు వరించినట్టే అని డీఎంకే భ్రమలో ఉన్నట్టుందని విమర్శించడం చర్చకు దారి తీసింది. ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలను డీఎంకే తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.


