పెట్టుబడుల..
71 పరిశ్రమలకు శంకుస్థాపన
రూ. 36,968 కోట్లతో పనులు
60,823 మందికి ఉపాధి
మరో 53 పరిశ్రమలలో పూర్తయిన పనులు
82,664 మందికి ఉద్యోగాలు
సీఎం స్టాలిన్ సమక్షంలో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, చైన్నె : తమిళనాడును ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యాన్ని సీఎం ఎంకే స్టాలిన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ చర్యలు విస్తృతం చేశారు. దేశ విదేశాలకు చెందిన సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలతో ఒప్పందాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ మేరకు గతంలో జరిగిన ఒప్పందాల మేరకు తమిళనాడులో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలు, యాజమాన్యాలకు పరిశ్రమల ఏర్పాటుకు గాను, అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, స్థల కేటాయింపు, సబ్సీడీలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 36,968 కోట్ల పెట్టుబడితో 60,823 మంది ఉపాధి కల్పించే విధంగా 71 పరిశ్రమల ముందుకు వచ్చాయి. ఈ పనులన్నింటికీ చైన్నెలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 31,934 కోట్లతో 82,664 మందికి ఉపాధి కల్పించే విధంగా పనులను సకాలంలో పూర్తి చేసిన 52 పరిశ్రమలలో ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తూత్తుకుడిలో కేన్స్ టెక్నాలజీస్ కంపెనీతో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, హెచ్డీఐ ఫ్లెక్కిబుల్ (పీసీబీ) ఉత్పత్తి ప్రాజెక్టు కోసం ఒకటి, తూత్తుకుడి ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చే దిశగా, ఆస్ట్రా జెనెకా గ్లోబల్ విస్తరణ కేంద్రం ఏర్పాటుకు మరొకటి చొప్పున రెండు అవగాహన ఒప్పందాలు ఈ సందర్భంగా జరిగాయి. తాజాగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిన ప్రాజెక్టులు రామనాథపురం, తూత్తుకుడి, తిరుచ్చి, విల్లుపురం, ధర్మపురి, రాణిపేట్, తిరుపత్తూరు, కోయంబత్తూర్, నామక్కల్, ఈరోడ్ తదితర జిల్లాలో ఉన్నాయి. ఇక భారత్ బయోటెక్ కంపెనీ రూ. 5000 కోట్ల పెట్టుబడి, 5,000 మందికి ఉపాధి దిశగా కాంచీపురం పారిశ్రామిక వాడలో ఔషధ తయారీ ప్రాజెక్టు, హ్యుందాయ్ మోటార్ ఇండియాతో ఒప్పందం మేరకు 7,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు టీఆర్బీ రాజ, సీఎస్ మురుగానందం, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జె. జయరంజన్, పరిశ్రమలు, పెట్టుబడి ప్రోత్సాహం విభాగ కార్యదర్శి వి. అరుణ్ రాయ్, తమిళనాడు ఇండస్ట్రీస్ గైడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దారెజ్ అహ్మద్ పాల్గొన్నారు.
నెర వేరిన కల..
ఉత్తర చైన్నె పరిధిలోని కొరుక్కుపేట– మనాలి రోడ్డులో రైల్వే 2బీ క్రాసింగ్లో రూ. 75 కోట్ల వ్యయంతో కొత్తగా వంతెన నిర్మించారు. ఈ పరిసర మార్గాలను కలిపేందుకు కోసం ఈ వంతెన ఏర్పాటైంది. ఈ పరిసర వాసుల కలగా ఉన్న ఈ బ్రిడ్జిని గురువారం సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అలాగే న్యూ మనలి రోడ్డు, కొరుక్కు పేట, తండయార్ పేట లోరూ. 1.10 కోట్లతో నిర్మించనున్న పార్కు పనులకు సీఎం స్టాలిన్ ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు నెహ్రూ, శేఖర్బాబు, మేయర్ ప్రియ, ఎంపీ కళానిధి వీరా స్వామి తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడుల..


