తిరుచ్చిలో నామినేషన్ దాఖలు
అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం
ప్రచార వాహనంలో విజయ్
విజిల్ గుర్తు
చూపుతున్న విజయ్
సాక్షి, చైన్నె: టీవీకే అధినేత విజయ్ చైన్నె పెరంబూరులో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. ఆయన తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైతం పోటీకి నిర్ణయించారు. దీంతో ఇక్కడ నామినేషన్ దాఖలు నిమిత్తం తిరుచ్చికి చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆయనకు టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆధవ్ అర్జున, నిర్మల్కుమార్ తదితరులు ఆహ్వానం పలికారు. విమానాశ్రయంలో అర్ధగంట పాటుగా విజయ్ తన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇక్కడి నుంచి తన ప్రచార వాహనంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి విజయ్ వెళ్లారు. మార్గం మధ్యలో విజయ్ను చూసేందుకు అభిమానులు, జనం ఎగబడ్డారు. తన వాహనం నుంచి వారికి అభివాదం తెలుపుతూ ముందుకు వెళ్లారు. అదే సమయంలో ఆయన వాహనాన్ని వెంబడిస్తూ యువకులు దూసుకొచ్చారు. కాన్వాయ్లోని ఓవాహనం ఢీ కొనడటంతో పోలీసు ఒకరు గాయపడ్డారు. అలాగే మేల పుదూర్ వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకోవడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ఓ చోట గాయపడి రోడ్డున పడ్డ మహిళా అభిమానితో పాటూ మరొకరి వద్దకు వెళ్లి విజయ్ పరామర్శించారు. కాగా, విజయ్ కాన్వాయ్లో ఓ యువతి మోటారు సైకిళ్పై దూసుకెళ్తుండటాన్ని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై ఆమె చిందులు తొక్కడం గమనార్హం. నామినేషన్ దాఖలు అనంతరం మరక్కడై వద్ద జరిగిన ప్రచార సభలో విజయ్ ప్రసంగించారు. ముందుగా ఆయన దివంగత ఎంజీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఉమ్మడి కుట్ర..
కరూర్ సంఘటన ఎలాగైతే ఒక కుట్రలో భాగమో, తన ’జననాయకన్’ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించడం వెనుక కూడా ఉమ్మడి కుట్ర ఉందని తన ప్రసంగంలో విజయ్ ఆరోపించారు. డీఎంకే వేరు, బీజేపీ వేరు కాదని, రాజకీయాల్లో ఈ రెండూ ఒక్కటే అని విజయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న ఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు, చిన్న హోటల్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్తున్నారని, గ్యాస్ కొరతను తీర్చడానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. దుష్ట శక్తి డీఎంకేను తరిమి కొడుదామన్నారు.
డీఎంకే, బీజేపీపై
విజయ్ విమర్శనాస్త్రాలు
వారివి బూటకపు హామీలు
2021 ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన నీట్ పరీక్ష రద్దు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. తిరుచ్చికి చెందిన ఓ మంత్రి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ. 12 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి తాను వచ్చానని పేర్కొన్నారు. తనను ఎదుర్కొనేందుకు పలు కూటములు రహస్య బంధంతో దూసుకొస్తున్నాయని, తనను ఎలా అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలుసునని వివరించారు. ప్రజలు అందరి కోసం వచ్చిన తనకు న్యాయం చేకూరే విధంగా అండగా నిలబడాలని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన వాగ్దానాలను విస్మరించనని, ఇప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినానంతరం మరో మాట మాట్లాడనని, నమ్మిన వారిని మోసం చేయడం తెలియదని, అబద్ధాలు వళ్లించడం అస్సలు తెలియదని, అందరికీ నిజాయితీ ఉంటానని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులకు విజిల్ చిహ్నంలో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయా నియోజకవర్గాలలోని అభ్యర్థులు, విజయ్ వేర్వేరు కాదని, అన్ని చోట్ల ఈ విజయ్ పోటీలో ఉన్నట్టుగా భావించి ఆదరించాలని విన్నవించారు. వంద శాతం ఈ విజయ్ను నమ్మండి, తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడిగే అవకాశం తనకు ఉందని, తనకు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విన్నవించారు. కాగా విజయ్ తిరుచ్చిలో ఇక బస చేసేందుకు వీలుగా అరియామంగళం గ్రామంలో ప్రత్యేక బంగళా సిద్ధం చేశారు.


