నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో 13.59 లక్షల మంది విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలు అందజేయనున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని ఇడయన్సాత్తు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలతోపాటు పాఠశాల, అంగన్వాడీ విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. వేలూరు జిల్లాల్లో మొత్తం 4.87లక్షల మందికి ఈ మాత్రలను అందజేయనున్నామన్నారు. ఆరోగ్యశాఖ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తిరువణ్ణామలై జిల్లాలో 6.79లక్షల మంది విద్యార్థులకు మాత్రలను అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఉన్నఅపోహలను వదిలి పెట్టి మాత్రలు వేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. మాత్రలను ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.


