సమాజం కోసం పెళ్లి చేసుకోను..!
తమిళసినిమా: కోలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో నటుడు శింబు ఒకరు. బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసిన ఈయన ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అంతేకాదు సంచలన నటుడిగా ముద్ర వేసుకున్నారు. సీనియర్ నటుడు టీ.రాజేందర్ వారసుడు అయిన శింబు ప్రేమాయణం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. మొదట నటి నయనతారతో ప్రేమ వ్యవహారం, ఆ తరువాత నటి హన్సికతో ప్రేమ పెళ్లి గడియల వరకు వెళ్లి ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం ఈయన వయసు 43 ఏళ్లు. ఇప్పటికీ అవివాహితుడిగానే ఉన్న శింబు పెళ్లి గురించి ప్రచారం కొనసాగుతూనే ఉంది. మరో విషయం ఏమిటంటే శింబు తమ్ముడు, చెల్లెలు పెళ్లిళ్లు జరిగి చాలా కాలమే అయ్యింది. కాగా ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ చిత్రంలో నటిస్తున్న శింబు ఇటీవల పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో. ‘‘ మొబైల్ ఫోన్లు అమల్లోకి వచ్చిన తర్వాత మనుషుల భావాలు మారిపోయాయి..ఎంత వేగంగా ప్రేమించుకుంటున్నారో , అంతే వేగంగా విడిపోతున్నారు. అయితే అందమైన ప్రేమానుబంధాలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నాకు సంబంధించినంత వరకు పెళ్లి అనేది అంత అవసరమైంది కాదు. మానసికంగా సిద్ధమైనప్పుడే పెళ్లి అనేది చేసుకోవాలి. అంతేగానీ ఈ సమాజాన్ని సంతృప్తి పరచడడం కోసం మాత్రం నేను పెళ్లి చేసుకోను ‘‘అని పేర్కొన్న ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


