మ్యానిఫెస్టోపై కసరత్తు
సాక్షి,చైన్నె : ఎన్నికల పనులను వేగవంతం చేయించే విధంగా బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ రంగంలోకి దిగారు. పార్టీ ఇన్చార్జ్లతో చైన్నెలో సోమవారం సమావేశమయ్యారు. ఎన్నికల విధుల నుంచి అన్నామలై తప్పుకోవడం గురించి ఈ భేటీలో చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. ఎన్నికల విధులను నేతలకు విభజించే విధంగా నియోజకవర్గాల వారీగా డివిజన్లకు ఇన్చార్జ్లను బీజేపీ అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నియమించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతల నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తప్పుకోవడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితులలో సోమవారం చైన్నె టీనగర్లోని కమలాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శిబిఎల్ సంతోష్ నేతృత్వంలో సమావేశం జరిగింది. పార్టీ ఎన్నికల పనులు, అంతర్గత వ్యవహరాల గురించి ఈ సమావేశం జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్చార్జ్ అరవింద్ మీనన్, కో– ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఈ సమావేశానికి హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అన్నామలై తనకు కేటాయించిన ఆరు నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జ్ పదవికి రాజీనామా చేయడం వెనుక గల కారణాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తాజాగా పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా అన్నామలై ఉండటంతో ఆయన్ని శాంతింపజేయడానికి బి.ఎల్. సంతోష్ స్వయంగా ప్రయత్నాలు చేపట్టినట్టు సమాచారం. కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన కాలం నుంచే అన్నామలై, సంతోష్ మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలు ఉన్నాయని, అన్నామలై బీజేపీలో చేరడంలో కూడా సంతోష్ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ని బుజ్జగించేందుకు సంతోష్ను బీజేపీ అధిష్టానం రంగంలోకి దించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
సమన్వయ కమిటీ ఏర్పాటుకు..
తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగమైన బీజేపీ, పీఎంకే, టీఎంసీ, ఏఎంఎంకే తదితర పార్టీల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పనులను సమన్వయం చేయడానికి 72 మందితో నియమితులైన ఇన్చార్జ్లు తమ పనులను వేగవంతం చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణులు ఐక్యతతో పనిచేయాలని, బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని బి.ఎల్. సంతోష్ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో మీడియా సమావేశాలలో జాగ్రత్తలు పాటించాలని, సీనియర్లు దయ చేసి ఆయా నియోజకవర్గాలలో ఉన్న ముఖ్య నేతలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముందుకెళ్లాలని సూచించినట్టు కమలాలయం వర్గాలు పేర్కొన్నాయి.


