సాధకులకు అవార్డుల ప్రదానం
సాక్షి, చైన్నె: అడ్డంకులను అధిగమించి సామర్థ్యాన్ని సాక్షాత్కరించి సాధకులుగా నిలిచిన వారికి కెవిన్ కేర్ ఎబిలిటీ అవార్డులను అందజేశారు. కెబిన్ కేర్, ఎ బిలిటీ ఫౌండేషన్ నేతృత్వంలో 24వ సంవత్సరంగా అవార్డుల ఉత్సవం చైన్నెలో జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశిష్ట కృషి చేసిన ఐదుగురు అసాధారణ వ్యక్తులను ఎంపిక చేసిన ఈ అవార్డులను అందజేశారు. కార్యక్రమానికి ప్రపంచకప్ గెలిచిన అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ టీసీ దీపిక, కేరళకు చెందిన తొలి అంధ న్యాయమూర్తి తన్య నాథన్లు ముఖ్య అతిథులుగా హాజరై అవార్డు గ్రహీతలను సత్కరించారు. సరిగమప విజేత పురుషోత్తమన్, శాసీ్త్రయ సంగీతకారుడు అభినయ సెన్బగరాజ్ బృందం ఈ సందర్భంగా సంగీత విభావరిని ఆహుతులకు వీనుల విందు చేశారు. 2003 నుంచి ఇప్పటి వరకు 100 మందికి పైగా దివ్యాంగులైన సాధకులను గుర్తించి అవార్డులతో సత్కరించి ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను స్పెషల్ రికగ్నిషన్ అవార్డును సునీల్ జైన్ (బెంగళూరు– ఓ సంస్థ ద్వారా విద్య, ఉపాధి, క్రీడలు, పౌర భాగస్వామ్య రంగాల్లో దివ్యాంగులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు), ఎబిలిటీ అవార్డు ఫర్ ఎమినెన్స్ను డా. జితేందర్ అగర్వాల్ (గురుగ్రామ్– సరత్కా ఎడ్యుకేషన వ్యవస్థాపకుడు), ఎబిలిటీ మాస్టరీ అవార్డులను అరివురాజా తంగవేలు (తమిళనాడు– మెప్పి ఐటీ సొల్యూషన్ ద్వారా డ్రోన్ సర్వేలు, మ్యాపింగ్ సేవలతో పాటూ దివ్యాంగులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు). శివ కుమార్ శర్మ (చండీగఢ్– చట్ట అవగాహన, థియేటర్, సినిమాల ద్వారా వైకల్య హక్కులపై చైతన్యం కల్పిస్తున్నారు), చంద్ర మౌళి ద్వారపురెడ్డి (ఆంధ్రప్రదేశ్ – ఓ ప్రమాదం జీవితాన్ని కృంగదీసినా, ఆ తదుపరి ఉన్నత విద్య పూర్తి చేసి ఐఐఎంఏలో చదవి ప్రస్తుతం అసెంచర్లో పనిచేస్తున్నారు)కి అందజేశారు. వేడుకలో కెవిన్ కేర్ చైర్మన్ సి.కె. రంగనాథన్ మాట్లాడుతూ, దివ్యాంగుల సామర్థ్యం సమాజాన్ని మారుస్తుందని పేర్కొంటూ, వీరి భవిష్యత్తు నిర్మాణమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎబిలిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జయశ్రీ రవీంద్రన్ మాట్లాడుతూ, 24 ఏళ్లుగా దివ్యాంగుల అసాధారణ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం గర్వకారణమని తెలిపారు.


