ప్రయత్నంతో పాటూ భక్తిభావం అవసరం
వేలూరు: ఫ్లస్–2, పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు భయపడకుండా దైర్యంగా పరీక్షలు రాసేందుకు ప్రయత్నంతో పాటూ భక్తిభావం కలిగి ఉండాలని శ్రీపురం బంగారుగుడి నారాయణి పీఠాధిపతి శక్తి అమ్మ అన్నారు. వివరాలు.. వేలూరు బంగారుగుడిలో పదవ తరగతి, ఫ్లస్–1, ఫ్లస్–2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం బంగారుగుడి ఆవరణలో మహా సరస్వతి యాగ పూజలు జరిగింది. ఈ సందర్భంగా యాగ పూజల్లో ఉంచిన పెన్లను గంపలో వేసి యాగంలో ఉంచిన కలశ నీటినిలో ముంచిన పెన్లను విద్యార్థులకు శక్తిఅమ్మ అందజేశారు. శక్తిఅమ్మ మాట్లాడుతూ బంగారుగుడి ఆధ్వర్యంలో 1992వ సంవత్సరం నుంచి విద్యా నేత్రం పథకం ద్వారా పేద విద్యార్థులకు అనేక విద్యా సదుపాయం అందజేస్తున్నామన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ విద్య తప్పనిసరిగా ఉండాలన్నారు. అదే విధంగా విద్య మాత్రమే ప్రతి ఒక్కరినీ ఉన్నత స్థానాలకు చేర్చగలదన్నారు. అటువంటి విద్యలో పరీక్షలు లేకుండా చదివితే వారి సామర్థ్యం బయటి ప్రపంచానికి తెలియదు కాబట్టే పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టారన్నారు. బాగా చదివినంత మాత్రాన పరీక్షలు రాసే సమయంలో భయాందోళన చెందితే చదువుకున్న అంశాలను స్పష్టంగా రాసే అవకాశం ఉండదన్నారు. ఫలితంగా సంవత్సరం విద్య పూర్తిగా వృథా అవుతుందన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల పరీక్షలకు కోసం సరస్వతి యాగ పూజలు నిర్వహించి కలశ నీటిలో ఉంచిన పెన్లను అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నారాయణి ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ, బంగారుగుడి డైరెక్టర్ సురేష్, ట్రస్టీ సౌందర్రాజన్, మేనేజర్ సంపత్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.


