ఊడిన కేశవ వినాయగం పదవి
●బీజేపీలో చర్చ
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కేశవ వినాయగంను తప్పించారు. మాజీ అధ్యక్షుడు అన్నామలై తరపున ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్ఎస్ఎస్ సమావేశంలో సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆర్ఎస్ఎస్లో ఐదు దశాబ్దాలుగా కేశవ వినాయగం సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొన్ని సంవత్సరాల పాటూ వ్యవహరిస్తూవస్తున్నారు. ఇటీవల బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైను తప్పించి, నైనార్ నాగేంద్రన్కు అధిష్టానం పదవి అప్పగించింది. ఆ తదుపరి పరిణామాలతో బీజేపీలో మార్పులు తథ్యమన్న చర్చ జరుగుతూ వచ్చింది. అదే సమయంలో అన్నామలై మద్దతుదారులు ప్రధాన కార్యదర్శి కేశవ వినాయగంపై ఫిర్యాదులు హోరెత్తించినట్టు సమాచారం. తిరుచ్చిలో కీలక నేతగా ఉన్న సూర్య బహిరంగంగానే కేశవ వినాయగంను టార్గెట్ చేయడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితులలో సాయంత్రం నుంచి సుదీర్ఘంగా చైన్నెలో ఆర్ఎస్ఎస్ కమిటీ సమావేశం చైన్నెలో జరిగింది. సమావేశంలో కేశవ వినాయగంను తప్పించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి నుంచి ఆయన్ని తొలగించినట్టు సమాచారాలు, తమిళ మీడియాలో వార్తలు హోరెత్తడంతో ఎన్నికల వేళ బీజేపిలో కొత్త చర్చ మీదకు వచ్చినట్లయ్యింది. ఈ పదవి ఎవరికి అప్పగిస్తారో అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఆర్ఎస్ఎస్ నుంచి కొందరిపేర్లను ఈ పదవికి తాజాగా బీజేపీ అధిష్టానానికి సిఫారస్సు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి.


