సింహ వాహనంపై శ్రీసోమస్కందమూర్తి తేజసం
తిరుపతి కల్చరల్: శ్రీకపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం రాత్రి శ్రీకామాక్షి అమ్మవారి సమేతంగా శ్రీసోమస్కందమూర్తి సింహ వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో తేజో విలాసంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామి వారి వాహన సేవ అత్యంత వేడుకగా సాగింది. అడుగడుగునా భక్తులకు కర్పూర హారతులు పట్టి స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి ముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి భూత వాహన సేవ కోలాహలంగా సాగింది. భజన మండళ్ల కళాకారుల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు భూత వాహనదారుడైన విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో సోమస్కందమూర్తి, శ్రీకామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల వారి ఆధ్వర్యంలో చేపట్టిన భక్తి సంగీత, నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరింపజేశాయి.


