భారంగా వీధి కుక్కల పర్యవేక్షణ
సాక్షి, చైన్నె: సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చైన్నెలో వీధి కుక్కలను సురక్షితంగా తరలించడానికి చైన్నె కార్పొరేషన్ వర్గాలు కుస్తీలు పడుతున్నాయి. ఈ శునకాలను ఎక్కడకు తరలించాలో కార్పొరేషన్ వర్గాలు నిర్ణయించలేక పోతున్నాయి. ఈ వ్యవహారంలో స్వచ్ఛంద సంస్థల మద్దతు కరువైనట్టు తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, వీధి కుక్కలను పెంపుడు జంతువులుగా పరిగణిస్తూ, ప్రతి కుక్కకు రూ.750 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా పరిగణించాన్నారు. ఇప్పటివరకు, 40 వీధి కుక్కలను పట్టుకున్నారు. వీటిలో 21 కుక్కలను నెమ్మెలిలోని స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేశారు, మిగిలినవి దత్తతకు ఇచ్చారు. అయితే, మొత్తం వీధి కుక్కల సంఖ్యను లెక్కించడం ఇంకా చైన్నెలో పూర్తి కాలేదని, తమిళనాడు జంతు సంక్షేమ బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నగరంలోని శివారు ప్రాంతాల్లో ఐటీ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని, సమస్యను పరిష్కరించడానికి, మాధవరం, వేలచ్చేరిలలో కొత్త ఆశ్రయ, శునకాల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి స్థలాలు గుర్తించినట్లు పేర్కొంటున్నారు. ప్రతి కేంద్రం 250 కుక్కలను సంరక్షించగల సామర్థ్యం కలిగి ఉండేలా చర్యలు చేపడుతున్నారు. కొత్త కేంద్రాలలో, రేబిస్ లక్షణాలు ఉన్న కుక్కలు, దూకుడు కుక్కలకు ప్రత్యేక బోన్లు , బహిరంగ ప్రదేశాలు కల్పించనున్నారు. మొత్తం 300 కుక్కలను కొత్త సౌకర్యాలలో సంరక్షించేందుకు ప్రణాళికా ప్రక్రియ కొనసాగుతోంది. అదే సమయంలో, వీధి కుక్కలను తరలించడంలో జాప్యం ప్రజల అసంతృప్తికి కారణమైంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ముఖ్యంగా అనేక ప్రాంతాలలో తాజాగా పెరుగుతున్న కుక్కల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.


