క్లుప్తంగా
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
వేలూరు: వేలూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ శివరామన్ అన్నారు. ఇక్కడ ఇప్పటి వరకవు విధులు నిర్వహిస్తున్న మయిల్వాణన్ను చైన్నె క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో చైన్నె నుంచి శివరామన్ను కేటాయించింది. దీంతో సోమవారం ఉదయం ఆయన వేలూరు ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులు కార్యాలయానికి చేరుకొని పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కొత్త ఎస్పీ మాట్లాడుతూ వేలూరు జిల్లాలో ట్రాఫిక్ సమస్యతో పాటూ శాంతి భద్రతలకు భంగం కలగకుండా శ్రద్ధ వహిస్తామన్నారు.
పాముకాటుకు
11వ తరగతి విద్యార్థి మృతి
తిరువొత్తియూరు: తిరువారూర్ సమీపంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాల తరగతి గదిలో పాము కాటుకు గురైన పదకొండవ తరగతి విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. తిరువారూర్ జిల్లా వలంగైమాన్ తాలూకాలో కేతనూర్ గ్రామం ఉంది. మేల్ వీధికి చెందిన మురుగానందం, రాధ దంపతులకు కుమారుడు కుట్టి అలియాస్ శివప్రకాశం, కూతురు శివశంకరి ఇద్దరూ కవలలు. వారిద్దరూ దగ్గరలోని అరిద్వారమంగళం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో గత 4 వ తేదీన తరగతి గదిలో పుస్తకాలు తీసుకుంటుండగా, కింద సంచిలో ఉన్న కట్లపాము శివప్రకాశాన్ని కాటు వేసింది. పక్కనే అతని చెల్లెలు శివశంకరి కూడా ఉంది. వెంటనే ఉపాధ్యాయులు శివప్రకాశాన్ని చికిత్స నిమిత్తం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతున్న శివప్రకాశం సోమవారం చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై అరిద్వారమంగళం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ రైలులో
డీఎంకే నేత మృతి
అన్నానగర్: పొన్నేరి సమీపంలోని అలాడు ప్రాంతానికి చెందిన డీఎంకేకు చెందిన ప్రేమ్కుమార్ (43) 17వ వార్డు మాజీ కౌన్సిలర్. ప్రేమ్కుమార్ ఊటీకి వెళ్లడానికి ఆదివారం పొన్నేరి నుండి చైన్నె సెంట్రల్కు ఎలక్ట్రిక్ రైలులో ప్రయాణించాడు. అతడి కోసం సెంట్రల్ రైల్వే స్టేషన్లో వేచివున్న బంధువు ఫోన్ ద్వారా సంప్రదించగా.. స్పందనలేకపోవడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా తిరువళ్లూరు సమీపంలో రైల్వే పోలీసులు రైలును తనిఖీ చేసినప్పుడు, ప్రేమ్ కుమార్ తన సీటులోనే కూర్చన్న స్థితిలో మృతి చెంది కనిపించాడు. అతని సెల్ ఫోన్ చోరీకి గురైంది. విచారణలో ప్రేమ్ కుమార్ ఎలక్ట్రిక్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడని తేలింది.
వాళప్పడి సమీపంలో..
సేలం: వజప్పడి సమీపంలో తనకోసం ముందస్తుగా సమాధి నిర్మించుకున్న రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆదివారం మరణించాడు. సోమవారం ఆయన బంధువులు నిర్మించిన సమాధిలోనే ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. వివరాలు.. పిచ్చముత్తు (74) సేలం జిల్లాలోని వజప్పడి సమీపంలోని ముత్తంపట్టి గ్రామంలో నివాసం ఉంటున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 15 సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేశారు. కాశీ,రామేశ్వరాన్ని పలుమార్లు సందర్శించి తిరిగి వచ్చారు. ఆయన అద్భుతమైన బ్యాడ్మింటన్ ఆటగాడు. అలాగే సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. అతని స్వస్థలమైన ముత్తంపట్టి గ్రామంలో, అతని చిత్రంతో కూడిన గ్రానైట్ సమాధి రాయిని 5 సంవత్సరాల క్రితం ఆయనే స్వయంగా నిర్మించుకుని గుర్తింపు పొందారు.
బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు
అన్నానగర్: వివాహం చేసుకుంటానంటూ బాలికను గర్భవతిని చేసిన యువకుడిని పోక్సో కేసులో అరెస్టు చేశారు. వివరాలు.. కడలూరు జిల్లా పన్రుట్టి సమీపంలోని అంకు చెట్టిపాళయం గ్రామానికి చెందిన కార్తీ (23) దినసరి కూలీ. పన్రుట్టి ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకుంటానని చెప్పి, అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీని కారణంగా, బాలిక అనారోగ్యానికి గురై పన్రుట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెను పరీక్షించినప్పుడు, ఆమె అప్పటికే 5 నెలల గర్భవతి అని గుర్తించారు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పన్రుట్టి ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుల పోక్సో కేసు నమోదు చేసి నిందితుడి కార్తీని అరెస్టు చేసి జైలుకు తరలించారు.


