తమిళనాడుకు మోదీ హల్వా
తిరుత్తణి: తమిళనాడుకు హల్వా ఇచ్చిన ప్రధాని మోదీ, బీజేపీ, అన్నాడీఎంకే కూటమికి ప్రజలు హల్వా ఇవ్వాలని ఎమ్మెల్యే చంద్రన్ పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయింపు చేయకుండా, ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తున్న కేంద్ర బీజేపీతో చేతులు కలిపిన అన్నాడీఎంకే పార్టీ తీరుకు నిరసనగా డీఎంకే ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తిరుత్తణి సమీపంలోని కార్తికేయపురంలో నిర్వహించిన ధర్నాలో డీఎంకే కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నాయి. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని రాష్ట్రానికి హల్వా ఇచ్చిన ప్రధాని మోదీకి బీజేపీ అన్నాడీఎంకే పార్టీల కూటమికి ప్రజలు హల్వా ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. తిరుత్తణి పట్టణంలో మాజీ డీఎంకే జిల్లా కార్యదర్శి భూపతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ధర్నాలో డీఎంకే కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా మోసగించిన బీజేపీ, అన్నాడీఎంకే కూటమికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నినాదాలు చేశారు.


