చార్జీలు పెంచాల్సిందే...!
సాక్షి, చైన్నె : క్యాబ్, ఆటోచార్జీల పెంపునకు డిమాండ్ చేస్తూ కార్మికులు సోమవారం కదం తొక్కారు. చైన్నెతో పాటూ పలు నగరాలలో నిరసనకు దిగారు. యాభై శాతం మేరకు డ్రైవర్లు పోరు బాటకు మద్దతు ఇచ్చారు. వివరాలు.. రాష్ట్రంలోని చైన్నె, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి తదితర ప్రధాన నగరాల్లో ఆటోలకు మీటర్లను 2013లో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఇది అమల్లో ఉన్నా, ఆ తర్వాత గాల్లో కలిసింది. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం ఆటో చార్జీల మీద దృష్టి పడింది. చార్జీల పెంపునకు అన్ని వర్గాల అభిప్రాయల సేకరణ నిమిత్తం ఓ కమిటిని నియమించింది. ఈ కమిటీ చార్జీల పెంపునకు తగ్గ సిఫారసులతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కార్మిక, ఆటో సంఘాలతో రవాణా, కార్మిక సంక్షేమ కమిషనర్ సమావేశమయ్యారు. కమిటీ సిఫారసు, అన్ని వర్గాల అభిప్రాయాలతో ప్రస్తుతం కొత్త చార్జీలను నిర్ణయించారు. అయితే దీనికి ఆటో కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. అలాగే తమ నేతృత్వంలో కొత్త చార్జీలు అంటూ ఓ జాబితాను ప్రకటించాయి. గత ఏడాది తమ చార్జీల వసూళ్లకు కార్మిక సంఘాలు నిర్ణయించినా, పోలీసులు కన్నెర్ర చేయడంతో వెనక్కి తగ్గారు. గత ఈ పరిస్థితులలో కొత్త చార్జీలను నిర్ణయించాలన్న నినాదంతో మంగళవారం ఆటో బంద్కు పిలుపు ఇచ్చారు. ఆటోతో పాటూ క్యాబ్ల యజమానులు, డ్రైవర్లు తమకు సైతం చార్జీలను నిర్ణయించాలన్న డిమాండ్తో ఒక రోజు నిరసన కార్యక్రమాన్ని హోరెత్తించారు. అనేక చోట్ల ఆటోల సేవలు ఆగాయి. మరికొన్ని ఆటోలు సాగినా, వాటిపై కన్నెర్ర చేస్తూ ఆందోళనకారులు దూసుకెళ్లే ప్రయ్నతం చేయడంతో కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. అలాగే చైన్నెలో రవాణా కమిషనరేట్ ముట్టడి దిశగా నిరసనలు దూసుకెళ్లగా పోలీసులు వారిని కట్టడి చేశారు.


