ఎన్నికలను విజయవంతం చేద్దాం!
సాక్షి, చైన్నె : తమిళనాడులో ఎన్నికల నగారా మోగించడం, భద్రతా చర్యలు, ఏర్పాట్లు ముమ్మరం అంశాలతో ఎన్నికలను విజయవంతం చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ముఖ్య పోలీసు అధికారులు, జీఎస్టీ, ఐటీ, అధికారులతో సమావేశం శనివారం చైన్నెలోని ఓ హోటల్లో నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్లు భానుప్రకాష్, మనీష్ గార్గ్, పవన్కుమార్ శర్మ, సంజయ్కుమార్, అశీష్ గోయల్ ఏడుగురు సభ్యులతో కూడిన బృందం బుధవారం రాత్రి చైన్నెకి చేరుకున్న విషయం తెలిసిందే. గురువారం పుదుచ్చేరిలోని ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. రెండో రోజుగా శుక్రవారం తమిళనాడులోని ఎస్పీలు, జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల ముఖ్యఅధికారులు, ఐటీ, జీఎస్టీ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. తమిళనాడు ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతాపరమైన అంశాలను గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికలను విజయవంతం చేయడం లక్ష్యంగా, నగదు బట్వాడా కట్టడి దిశగా భద్రత ఏర్పాట్లు, తనిఖీలు, సమష్టి సమన్వయం వంటి అంశాల గురించి ఎన్నికల డిప్యూటీ కమిషనర్లు ఇక్కడి అధికారులకు వివరించారు. మార్చిలో నగారా మోగించే దిశగా సూచనప్రాయంగా సమాచారం. ఈ సమావేశంలో వెలువడినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, కౌంటింగ్ కేంద్రాల అంశాలతోపాటు ఇక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా ఎన్నికల కమిషనర్లు సూచనలు చేసినట్టు తెలిసింది.


