కంట్రోలర్పై వేటు
● టీఎన్పీఎస్సీలో హైడ్రామా
సాక్షి, చైన్నె: చివరి క్షణంలో పరీక్ష రద్దు వ్యవహారం రచ్చకెక్కడంతో తమిళనాడు పబ్లిక్ సర్వీసుకమిషన్(టీఎన్పీఎస్సీ)లో సోమవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పరీక్షల విభాగం కంట్రోలర్గా ఉన్న షణ్ముగ సుందరంపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆయన్ని ఆ బాధ్యతలనుంచి తప్పించారు. వివరాలు.. గ్రూప్ –2, గ్రూప్ –2ఏ పరీక్షలు ఆదివారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో టీఎన్పీఎస్సీ అధికారుల నిర్వాకంతో అభ్యర్థులు తీవ్ర మనో వేదనలో పడ్డారు. పరీక్ష కేంద్రాల మార్పు, హాల్ టికెట్లో గందరోగోళం వంటి పరిణామాలతో చివరి క్షణలో పరీక్షలను వాయిదా వేశారు. దీంతో అభ్యర్థులు పలు చోట్ల ఆందోళనకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాలు సోమవారం టీఎన్పీఎస్సీలో పెద్ద హైడ్రామాకు దారి తీసింది. కంట్రోలర్గా ఉన్న సోమసుందరంను ఆ బాధ్యతల నుంచి హుటా హుటీన తప్పించారు. ఆయన స్థానంలో వెంకట ప్రియ అనే అధికారి నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టగానే పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న పరిణామాలు, హాల్ టికెట్గందరోళం తదితర అంశాలపై దర్యాప్తు మొదలెట్టారు. అలాగే మళ్లీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన కసరత్తును ప్రారంభించినట్లు తెలిసింది.
మానవతా సేవల్లో విశేష కృషికి అవార్డులు
సాక్షి, చైన్నె : భగవాన్ మహావీర్ ఫౌండేషన్ 29వ మహావీర్ అవార్డుల విజేతల జాబితాను సోమవారం ప్రకటించింది. అహింస – శాఖాహారం, విద్య, వైద్యం, సమాజం – సామాజిక సేవ రంగాల్లో నిస్వార్థంగా సేవలందించిన వ్యక్తులు, సంస్థలను అవార్డుతో సత్కరించనున్నారు. ఈ ఏడాది అవార్డు గ్రహీతలుగా మహారాష్ట్రకు చెందిన సర్హాద్ (అహింస – శాఖాహారం), హిమాచల్ ప్రదేశ్కు చెందిన సీఓఆర్డీ సంస్థ (విద్య), కర్ణాటకకు చెందిన శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్ (వైద్యం), మిజోరాంకు చెందిన శ్రీమతి సంగ్కుమి బువల్చువాక్ (సమాజ – సామాజిక సేవ), ఒడిశాకు చెందిన నిర్మాన్ (సమాజ – సామాజిక సేవ) ఎంపికయ్యారు. కాగా మహావీర్ అవార్డులను ప్రతి సంవత్సరం సమాజంలోని వెనుకబడిన, బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన వారికి అందజేయడం జరుగుతోంది. అవార్డుతో పాటూ రూ.10 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేస్తున్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య నేతృత్వంలోని ప్రముఖ జ్యూరీ నామినేషన్లను పరిశీలించి విజేతలను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా భగవాన్ మహావీర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుగల్చంద్ జైన్ మాట్లాడుతూ, సమాజ సంక్షేమానికి అంకితమైన వ్యక్తులు, సంస్థలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వారి సేవలను గుర్తించడం గర్వకారణమని తెలిపారు. త్వరలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.
చిదంబరం
నటరాజ ఆలయానికి ..
కొరుక్కుపేట: చైన్నెకు చెందిన ఓ భక్తుడు. చిదంబరం నటరాజ ఆలయానికి 50 పౌండ్ల బంగారు నాణేలతో దండను కానుకగా ఇచ్చి తనలోని భక్తిని చాటుకున్నారు. వివరాలు.. కడలూరు జిల్లాలోని చిదంబరంలో ప్రసిద్ధ నటరాజ ఆలయం ఉంది. చైన్నెకి చెందిన సుబ్రమణ్యం అనే భక్తుడు ఆలయ శిత్ సభలో ప్రతిష్టించబడిన శివగామి అమ్మవారికి అలంకరించడానికి దాదాపు రూ.45 లక్షల విలువైన 50 పౌండ్ల బంగారు నాణెం దండను విరాళంగా ఇచ్చాడు. దానిని నటరాజ ఆలయ బోర్డు దీక్షితర్, కార్యదర్శి శివసుందర దీక్షితర్లకు తన ప్రధాన దేవత రామలింగ దీక్షితార్ ద్వారా నైవేద్యంగా సమర్పించారు. సోమవారం ఉదయం పూజ సమయంలో బంగారు నాణేల దండను శివగామి అమ్మవారికి అలంకరించారు.
కొత్త బస్ స్టేషన్ల ప్రారంభంతో ట్రాఫిక్ సమస్యకు చెక్
కొరుక్కుపేట: ఆధునిక బస్ స్టేషన్లు ప్రారంభంతో ట్రాఫిక్ రద్దీ తగ్గిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈక్రమంలో కన్నదాసన నగర్ బస్ స్టేషన్, ఎం.కె.పి. నగర్ ముల్లై నగర్ బస్ స్టేషన్లను కొత్తగా నిర్మించారు. ఈ పనులు మహానగర అభివృద్ధి కమిటీ తరపున జరిగాయి. గత ఏడాది కాలంగా చేపట్టిన పనులు పూర్తయ్యాయి. రెండు బస్టాండ్లను ప్రజల ఉపయోగం కోసం తీసుకువచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కొత్త బస్టాండ్లను ప్రారంభించారు. వీటిలో సోమవారం నుండి కొత్త సర్వీసులను ప్రారంభమయ్యాయి.


