ముగిసిన ఓటర్ల నమోదు ప్రక్రియ
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో ఓటరు నమోదుకు తుది అవకాశం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 17వ తేదీన తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించనున్నారు. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి తెలిసిందే. ఇందులో 97 లక్షల ఓటర్ల వివరాలు లేనట్టు ఎన్నికల కమిషన్ పరిశీలనలో తేలింది. ఆ తదుపరి విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వాళ్లు తమ పేర్లను మళ్లీ నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు. గత నెల 30 వరకు రెండు సార్లు గడువు పొడిగింపుతో నమోదుకు అవకాశం ఇచ్చారు. అయితే మరో పది రోజులు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆదిశగా అవకాశం కల్పించారు. ఈ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తాజా ఎంత మంది ఈ పది రోజులలో పేర్లు నమోదు చేసుకున్నారో అన్న వివరాలు తెలియాల్సి ఉంది. అన్ని దరఖాస్తులను పరిశీలించి, ముందుగా నిర్ణయించిన మేరకుఈనెల 17న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ కసరత్తులలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం 68,400 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తూ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధంగా ఉన్నట్టుగా పేర్కొంటూ ఎన్నికల వర్గాలు ప్రత్యేక నివేదికలను సిద్దంచేసి ఉంచారు. మరికొద్ది రోజులలో కేంద్ర ఎన్నికల కమిషన్వర్గాల సమాలోచన తదుపరి ఎన్నికల నగారా మార్చి మొదటి వారంలో మోగే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎన్నికల సంఘ కార్యాలయం


