అన్నామలైకు త్వరలో కొత్త బాధ్యత
సాక్షి, చైన్నె: ఎన్నికల పనుల నుంచి తప్పుకున్న బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను ఆ పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్ బుజ్జగించే పనిలో పడ్డారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ కమిటీల బలోపేతం, పర్యవేక్షణ నిమిత్తం శక్తి కేంద్రం బాధ్యతలను అన్నామలైకు బీజేపీ అధిష్టానం అప్పగించనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. ఎన్నికల విధులను నేతలకు విభజించే విధంగా నియోజకవర్గాల వారీగా డివిజన్లకు ఇన్చార్జ్లను బీజేపీ అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నియమించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతల నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తప్పుకోవడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితులలో చైన్నెకు వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. అన్నామలైను బుజ్జగించే విధంగా సంతోష్ మంగళవారం ముందుకు సాగారు. అన్నామలై, నైనార్ నాగేంద్రన్లతో తో సంతోష్ సమావేశం నిర్వహించారు. త్వరలో అన్నామలైకు ఎన్నికలకు సంబంధించిన కీలక బాధ్యతలను అప్పగించే విధంగా నిర్ణయంచినట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్కమిటీల పర్యవేక్షణ, బలోపేతం తదితర పనులను పార్టీ తరపున శక్తి కేంద్ర బాధ్యతగా అన్నామలైకు పనులను అప్పగించనున్నట్టు కమలాలయంలో చర్చ ఊపందుకుంది. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కేశవ వినాయగంను తప్పించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆర్ఎస్ఎస్లో ఉత్తర తమిళనాడు కార్యనిర్వాహక కమిటీ సభ్యుడి పదవిని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


