క్లుప్తంగా
వేర్వేరు కారణాలతో ఆత్మహత్యలు
అన్నానగర్: చైన్నెలోని కొళత్తూర్ ప్రాంతానికి చెందిన ఎత్తిరాజ్ (55) పారిమునైలోని రాజాజీ రోడ్డులోని పోస్టాఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఎత్తిరాజ్ తన సెల్పోన్, బ్యాగ్ను రాజా అన్నా ములైపురం గ్రీన్ వేస్ రోడ్డులోని ఫ్లయింగ్ రైలు స్టేషన్ ఫ్లాట్పారంపై వదిలివేసి, అకస్మాత్తుగా ఫ్లయింగ్ రైలు వంతెనపై నుండి ఆడయార్ నదిలోకి దూకాడు. ఈ విషయం తెలుసుకున్న అభిరామపురం పోలీసులు అగ్ని మాపక సిబ్బంది సహాయంతో నదిలో దూకిన ఎత్తిరాజ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఎత్తిరాజ్ నదిలో దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటన
కోయంబత్తూరు జిల్లాలోని ఇట్టిడేపాళయం గ్రామానికి చెందిన చిన్నదురై కుమారుడు మోహన్ రాజ్(25) కూలీ. ఇతనిపై ఇప్పటికే సిరుముటై పోలీస్ స్టేషన్లో దాడి కేసు, ఈరోడ్ జిల్లాలో గంజాయి కేసు ఉన్నాయి. గంజాయి అమ్మినందుకు ఈరోడ్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలులో ఉంచారు. ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. గత 3 నెలలుగా అతను పోలీస్స్టేషన్కు వెళ్లి ఒక పిటిషన్పై సంతకం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతోనే తన జీవితం కోల్పోయానని చెబుతూ వీడియో రికార్డు చేసి, ఆపై తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పెన్షనర్ల వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
వేలూరు: పెన్షనర్లకు వ్యతిరేకంగా ప్రవేశ పెడుతున్న పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు అన్ని పెన్షనర్ల సంఘాల అద్వర్యంలో వేలూరులోని ప్రధాన పోస్టల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఆ సంఘం జిల్లా అద్యక్షుడు పన్నీర్సెల్వం నాయకత్వం వహించగా జిల్లా కార్యదర్శి లోకనాథన్ మాట్లాడారు. తమిళనాడు రిటైర్డ్ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు జనార్దనన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంక్షేమానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు సెట్ల చట్టాలను రద్దు చేయాలని, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన 2025 చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ పథకాలకు మహాత్మాగాంధీ పేరును తొలగించి కొత్త పేర్లు ప్రవేశ పెట్టడాన్ని మానుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించారు. ఈ ధర్నాలో తమిళనాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కూటమి జిల్లా కార్యదర్శి జోసెఫ్ అన్నయ్య, ఆల్ డిపార్ట్మెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రిష్ణమూర్తి, కన్వీనర్ జ్ఞానశేఖరన్, వివిధ పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తల్లిపాలు తాగుతూ చిన్నారి మృతి
తిరుత్తణి: తల్లిపాలు తాగుతుండగా, అస్వస్థతకు గురై 9 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సునీల్ సలీమ్(29) అతని భార్య సీత(27) కనకమ్మసత్రంలో అద్దె ఇంట్లో రెండేళ్లుగా కాపురంఉంటున్నారు. ప్రైవేటు కర్మాగారంలో పని చేస్తూ సునీల్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతులకు వితిష అనే 9 నెలల పాప ఉంది. బుధవారం సాయంత్రం బిడ్డకు సీత తల్లిపాలిస్తుండగా, చిన్నారికి అస్వస్థతకు గురైంది. వెంటనే స్థానికంగా ఉంటున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి 108 ఆంబులున్స్ ద్వారా తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చిన్నారి మృతి చెందింది. కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిపాలు తాగుతూ చిన్నారి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది.
టీవీకే కార్యకర్తల హల్చల్
తిరువొత్తియూరు: తిరువణ్ణామలై జిల్లా వందవాసిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) జిల్లా కార్యదర్శి ఉదయకుమార్ పుట్టినరోజు వేడుకల్లో భయపెట్టే విధంగా చేతిలో కత్తి పట్టుకుని హంగామా చేసిన ఆ పార్టీ కార్యదర్శితోపాటు 50 మంది నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళగ వెట్రి కళగం తిరువణ్ణామలై తూర్పు జిల్లా కార్యదర్శిగా ఉదయకుమార్ పనిచేస్తున్నారు. అతని పుట్టినరోజు వేడుకలకు టీవీకే నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వందవాసి ఐదు కాళ్ల వంతెన దగ్గర నుండి తెరిచిన వాహనంలో జిల్లా కార్యదర్శి ఉదయకుమార్ నిలబడి వచ్చారు. అప్పుడు టీవీకే నిర్వాహకులు జిల్లా కార్యదర్శి ఉదయకుమార్కు నిబంధనలకు విరుద్ధంగా క్రేన్ ద్వారా దండలు వేశారు. తర్వాత దారి పొడవునా టపాసులు పేల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఊరేగింపుగా వెళ్లారు. అప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. దీని తరువాత జిల్లా కార్యదర్శి ఉదయకుమార్ చేతిలో తుపాకీ లాంటి టపాసు చేతిలో పట్టుకుని కాల్చారు. దీన్ని కొనసాగిస్తూ చేతిలో కత్తి పట్టుకుని తిప్పి చూపించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా, ప్రజలకు భయం కలిగించే విధంగా నిబంధనలకు విరుద్ధంగా క్రేన్ ద్వారా దండలు వేసి పాల్గొన్న జిల్లా కార్యదర్శి ఉదయకుమార్, కార్యదర్శులు నైనా మహమ్మద్, వసంతకవిన్, సమాచార సాంకేతిక విభాగం మణికందన్, యువజన విభాగం తిరువాసగమణి, యూనియన్ కార్యదర్శులు తిరుమలై, జయరాజ్తో పాటు 50 మంది టీవీకే నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా నిబంధనలకు విరుద్ధంగా క్రేన్ ద్వారా దండలు వేసినందున పోలీసులు క్రేనన్ను స్వాధీనం చేసుకున్నారు.


