నేడు కారైక్కాల్కు అమిత్షా
న్యూస్రీల్
సాక్షి, చైన్నె: కేంద్ర హోంమంత్రి అమిత్షా శనివారం పుదుచ్చేరిలోని కారైక్కాల్లో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తమిళనాడులో డీఎంకేను గద్దె దించి తీరతానన్న సంకల్పంతో అమిత్షా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే, బీజేపీ నేతృత్వంలో బలమైన కూటమి దిశగా కసరత్తులు వేగవంతం చేశారు. తాజాగా మరోమారు రాష్ట్ర పర్యటనకు అమిత్షా వచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన తిరుచ్చికి చేరుకున్నారు. ఇక్కడి హోటల్లో బస చేశారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
నేడు కారైక్కాల్లో సభ
కారైక్కాల్లో జరిగే ఎన్డీఏ కూటమి బహిరంగ సభకు శనివారం అమిత్షా హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుచ్చి నుంచి హెలికాప్టర్లో పుదుచ్చేరి వెళ్తారు.11 గంటలకు పుదుచ్చేరిలోని ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి నేతలందర్నీ అమిత్షా మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి పరిచయం చేయనున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరునల్లారు వెళ్తారు. ఇక్కడ శని భగవానుడి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం పార్టీ వర్గాలతో సమావేశం అవుతారు. నాలుగు గంటలకు ఇక్కడి నుంచి హెలికాప్టర్లో తిరుచ్చి వెళ్తారు. ఇక్కడ అమిత్షా తమిళనాడు బీజేపీ నేతలు, కూటమి పార్టీలతో సమావేశం కానునున్నారు. పొత్తు కసరత్తులను డీఎండీకేతో ముగించి, అమిత్షా ముందుకు ప్రేమలత విజయకాంత్, సుదీష్ నేతలను తీసుకెళ్లే దిశగా బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. అలాగే, పుదియ తమిళగం నేత కృష్ణస్వామిని సైతం అమిత్ షా వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు విస్తృతం చేశారు. కారైక్కాల్కు రానున్న అమిత్షాకు బ్రహ్మరథం పట్టే విధంగా పుదుచ్చేరిలో బీజేపీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి.
అభివృద్ధి పనుల పరిశీలన
కొరుక్కుపేట: పెరంబూర్లోని తిరువికానగర్లో అభివృద్ధి పనులను హిందూధర్మాదాయశాఖా మంత్రి పి.కె.శేఖర్బాబు పరిశీలించారు. ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రాజెక్టు కింద, తిరువికానగర్, ఒట్టేరి, పెరంబూరు, జమాలియా, మంగళపురం ప్రాంతాలలో సీఎండీఏ చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు నిర్మాణ పనులు శుక్రవారం ఉదయం మంత్రి పీకే శేఖర్బాబు స్వయంగా వెళ్లి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెలలో 20కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజల ప్రయోజనం కోసం అంకితం చేసినట్లు తెలిపారు. తమిళనాడు రవాణా సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి 25వ తేదీన ప్రజల ప్రయోజనం కోసం 20 కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారన్నారు.


