సాక్షి, హైదరాబాద్: లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి రైలుమార్గం సుగమం కానుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి ఎంఎంటీఎస్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆరీ్వఎన్ఎల్) టెండర్లు దక్కించుకుంది. ఇప్పటికే రాయగిరి వరకు భూసేకరణ పూర్తి కావడంతో త్వరలో పనులను ప్రారంభించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్వేశాఖ సొంత నిధులతో రాయగిరి వరకు సుమారు 33 కి.మీ. నిర్మాణానికి రూ.430 కోట్లకు పైగా వ్యయం కానున్నట్లు అంచనా. ఎంఎంటీఎస్ రైళ్లు వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా రాయగిరికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో యాదాద్రికి వెళ్లవచ్చు.
నగర వాసులకు ఉపయుక్తం..
ప్రస్తుతం నగరవాసులు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లోనే యాదాద్రికి రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే సదుపాయం అందుబాటులో లేకపోవడంతో నగరవాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సైతం రోడ్డు మార్గంలోనే వెళుతున్నారు. అప్పట్లో యాదా ద్రి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఎంఎంటీఎస్ రెండో దశను పొడిగించాలని ప్రతి పాదించారు. ఈ మేరకు 2015లోనే క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి ప్రణాళికలను సిద్ధం చేసినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన జాప్యం నెలకొంది. సుమారు 9 ఏళ్లపాటు పెండింగ్లో ఉంది. చివరకు రైల్వేశాఖ స్వయంగా నిర్మించాలని నిర్ణయించడంతో భూసేకరణతో పాటు, నిర్మాణ సంస్థల ఎంపిక తదితర పనుల్లో పురోగతి చోటుచేసుకుంది.
అన్ని వైపుల నుంచీ..
ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ఎక్కడి నుంచైనా నేరుగా యాదాద్రికి చేరుకొనే సదుపాయం లభిస్తుంది. పటాన్చెరు, తెల్లాపూర్, లింగంపల్లి, ఉందానగర్, మేడ్చల్ తదితర నగర శివారు ప్రాంతాల నుంచి కూడా ఎంఎంటీఎస్ రైళ్లలో రాయగిరికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో 4 కి.మీ రోడ్డు మార్గంలో యాద్రాద్రికి వెళ్లవచ్చు.


