ఆన్లైన్ నియంత్రణకు ప్రభుత్వం రెడీ!
వయసును బట్టే ‘నెట్’లోనికి అనుమతి
ముప్పును తప్పించేందుకే ఈ నిర్ణయం..
పిల్లల్ని కాదు, కంపెనీలను నియంత్రించాలని సూచన
పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. గతవారం ఢిల్లీలో జరిగినఏఐ ఇంపాక్ట్ సదస్సులో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పిల్లల్ని ఆన్లైన్నుంచి దూరం చేస్తూ నియంత్రణలను అమలు చేస్తున్నాయి. –సాక్షి స్పెషల్ డెస్క్
నియంత్రణ ఎందుకు?
సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, ఆన్లైన్ లో భద్రతా పరమైన ముప్పు పొంచి ఉండటం పట్ల సామాజికవేత్తలు, పిల్లల తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియంత్రణ గురించి యోచిస్తోంది.
అమలు సాధ్యమేనా?
నియంత్రణలు విధించడం మంచిదే అయినా, వాటిని అమలు చేయడం అంత సులభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదా : ఇంట్లో అందరూ వాడే ఫోన్ల ద్వారా పిల్లలు సులభంగా తమ వయసును తప్పుగా చూపి సోషల్ మీడియాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో నియంత్రణ నిష్ఫలం అవుతుంది.
మరికొన్ని సమస్యలు
నియమాలు కఠినంగా ఉంటే పిల్లలు తక్కువ పర్యవేక్షణ ఉండే ఇతర ప్రమాదకరమైన యాప్స్ వైపు వెళ్లే ప్రమాదం ఉంది. అదీగాక, ఇంటర్నెట్లో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని కూడా వారు కోల్పోవచ్చు. చివరికి మంచి చేయబోతేచెడు ఎదురైనట్లవుతుంది.
నిపుణుల సూచన
పిల్లలను సోషల్ మీడియాకు దూరం చేయడం కంటే కూడా, టెక్నాలజీ కంపెనీలు తమ ప్లాట్ఫాంల డిజైన్ను మార్చాలని నిపుణులు చెబుతున్నారు. యాప్స్కు బానిసల్ని చేసే ఫంక్షన్లను, ఆప్షన్లను తొలగించాలని వారు చెబుతున్నారు. అలాగే కంటెంట్ను సరిగ్గా నియంత్రించేలా కంపెనీలపై ఒత్తిడి తేవడమే సరైన పరిష్కారమని వారు అభిప్రాయపడుతున్నారు.



