మూడు నెలల్లో రూ. 8.17 లక్షల కోట్ల బంగారం రుణాలు
కొత్త రుణాల్లో విలువ పరంగా అగ్రస్థానం
పసిడి తాకట్టులో టాప్–4లో ఏపీ, తెలంగాణకు చోటు
బంగారం రుణాలు భారత్లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. కొత్తగా మంజూరైన రిటైల్ లోన్స్లో దాదాపు మూడింట ఒకవంతు వాటాతో ఈ విభాగం అగ్రస్థానం కైవసం చేసుకుంది. పసిడి ధర పరుగు తీస్తుండడంతో తాకట్టు ద్వారా అందుకునే రుణ మొత్తమూ పెరుగుతోంది. దీంతో జనం గోల్డ్లోన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 2025 అక్టోబర్–డిసెంబర్ కాలంలో రూ.8.17 లక్షల కోట్ల గోల్డ్లోన్స్ మంజూరయ్యాయి.
ఇదే కాలంలో పర్సనల్ లోన్స్, హోమ్, ఆటో, కంన్జ్యూమర్ డ్యూరబుల్, టూ వీలర్ లోన్స్ కలిపి కస్టమర్లు మొత్తం రూ.8.03 లక్షల కోట్ల రుణం అందుకున్నారు. విలువపరంగా పసిడి రుణాలు ఈ ఐదు విభాగాల కంటే అధికంగా నమోదు కావడం విశేషం. గత ఏడాది జూలై–సెప్టెంబర్లో కొత్తగా తీసుకున్న పసిడి రుణాలు రూ.6.04 లక్షల కోట్లు.
దీనిని బట్టి రుణ మార్కెట్లో పుత్తడి ఏ స్థాయిలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ నాటికి కస్టమర్లు మొత్తం రూ.43 లక్షల కోట్ల హోమ్ లోన్స్ అందుకున్నారు. బంగారం రుణాలు రూ.16.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే గోల్డ్లోన్స్ రెండేళ్లలో రెండింతలు కావడమే. – సాక్షి, స్పెషల్ డెస్క్
అత్యధికులు లక్ష లోపే..
తాకట్టు పెట్టిన బంగారం ద్వారా కస్టమర్లు అందుకున్న సగటు రుణం 2025 అక్టోబర్–డిసెంబర్లో రూ.1.9 లక్షలకు చేరింది. రెండేళ్ల క్రితం ఇది కేవలం రూ.1.1 లక్షలు మాత్రమే. అంటే సగటు లోన్ మొత్తం 72% పైగా పెరిగిందన్నమాట. ఇక రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారి సంఖ్య 51.1% ఉంది.
కొత్త కస్టమర్లలో సగం మంది బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) ద్వారా గోల్డ్లోన్ స్వీకరించారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి 32.7%, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా 8.5% మంది రుణం పొందారు. వినియోగదారుల్లో 36–45 వయసున్నవారు దాదాపు మూడింట ఒకవంతు ఉన్నారు. 56% మంది రుణగ్రహీతలు పురుషులు కాగా మిగిలినవారు స్త్రీలు.
భారత్లో పసిడి రుణాలు ఇలా..
2025 డిసెంబర్ నాటికి మొత్తం గోల్డ్లోన్స్ రూ.16.2 లక్షల కోట్లు
ఏడాదిలో రుణ విలువ వృద్ధి 44.1%
ఖాతాల సంఖ్య 9.07 కోట్లు
గత ఏడాది అక్టోబర్–డిసెంబర్లో కొత్తగా మంజూరైన రుణం రూ.8.17 లక్షల కోట్లు



