ఈ వారం భారీ అమ్మకాలకు చాన్స్
సెంటిమెంటుకు చమురు ధరల సెగ
హోలీ సందర్భంగా 3న సెలవు
ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆందోళనలు ఉపశమించే వరకూ సెంటిమెంటు బలహీనపడనున్నట్లు అంచనా వేశారు. వీటికితోడు చమురు ధరలకు రెక్కలువస్తే అటు వాణిజ్య లోటు, ఇటు రూపాయి బలహీనపడవచ్చని తెలియజేశారు. వివరాలు చూద్దాం..
ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్అరబ్ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి.
హుర్ముజ్ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది.
వెరసి తాజా పరిస్థితులు దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్కు ద్రవ్యోల్బణ సమస్యలు తలెత్తవచ్చని, దీంతో ఆర్బీఐ పరపతి విధానాలపై ప్రభావం పడవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొ న్నారు. టెక్నాలజీ స్టాక్స్లో బలహీనతలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా ప్రస్తావించారు.
ఆటో అమ్మకాల ఎఫెక్ట్
రేపు(3న) హోలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. ఫిబ్రవరి నెలకు ఆటో రంగ(వాహన) అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఫలితంగా నేడు(2న) ఆటో కౌంటర్లు వెలుగులో నిలచే వీలుంది. వారాంతాన ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే.
అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కొత్త సిరీస్ ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం పురోగతి సాధించింది. ఈ బాటలో ఈ వారం పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. మరోపక్క యూఎస్, చైనా గణాంకాలు సైతం విడుదలకానున్నాయని, వీటి ఆధారంగా ఈ వారం మార్కెట్లలో యాక్టివిటీ నమోదుకానున్నట్లు నిపుణులు ప్రస్తావించారు.
సాంకేతికంగా చూస్తే..
గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడిదారులుగా మారి రూ. 22,615 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధభయాలు ఇండెక్సులను దెబ్బతీసే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వీరి అంచనాల ప్రకారం..
→ ఈ వారం నిఫ్టీ 25,000 పాయింట్ల దిగువకు చేరవచ్చు. 24,800–24,700 స్థాయిలో సపోర్ట్ లభించే వీలుంది. ఇక్కడినుంచి బౌన్స్ అయితే 25,500–25,700 పాయింట్లవరకూ బలపడవచ్చు.
→ సెన్సెక్స్ 81,000 పాయింట్ల దిగువకు చేరవచ్చు. ఆపై 80,500–80,100 పాయింట్లస్థాయిలో మద్దతు కనిపించే వీలుంది. ఇక్కడి నుంచి పుంజుకుంటే 82,000– 82,500 పాయింట్లవరకూ పురోగమించే అవకాశముంది.
గత వారమిలా
ఆటుపోట్ల మధ్య గత వారం(ఫిబ్రవరి 23–27) దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 1,528 పాయింట్లు(2 శాతం) పతనమై 81,287 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 393 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 25,179 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్


