ఇక చిన్న నోట్ల ఏటీఎంలు! | New ATMs May Soon Offer ₹10, ₹20 And ₹50 Notes To Fix Currency Shortage, Know More Details Inside | Sakshi
Sakshi News home page

ఇక చిన్న నోట్ల ఏటీఎంలు!

Feb 1 2026 6:04 AM | Updated on Feb 1 2026 9:23 AM

New ATMs may soon offer Rs 10 and Rs 20 and Rs 50 notes

రూ.10, రూ.20, రూ.50 నోట్లు అందుబాటులో ఉంచడంపై కేంద్రం దృష్టి 

ముంబైలో ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు ..  దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడంపై త్వరలో నిర్ణయం

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: డిజిటల్‌ పేమెంట్స్‌ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నా.. ఇప్పటికీ నగదు లావాదేవీలు భారతీయుల దైనందిన జీవితంలో భాగంగానే ఉన్నాయి. చిన్న నోట్లతో ముడిపడిన లావాదేవీలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే మార్కెట్లో చిన్న నోట్ల కొరత తీవ్రంగా ఉంది. ఇందుకు పరిష్కా
రంగా రూ.10, రూ.20 నాణేలను విరివిగా ప్రవేశపెట్టినా జనం నుంచి వీటికి స్పందన అంతంతే ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది.  

ఇళ్లకే పరిమితం అవుతున్న నాణేలు! 
తక్కువ విలువ కలిగే కరెన్సీ నోట్ల కొరతకు చెక్‌ పెట్టేందుకు, అలాగే మన్నికగా ఉంటాయన్న భావనతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొన్నేళ్లుగా రూ.10, రూ.20 కాయిన్స్‌ వైపు మొగ్గు చూపుతోంది. నోట్లకు అలవాటు పడిన జనం ఈ కాయిన్స్‌ను తీసుకుంటున్నా అవి తిరిగి చలామణి వ్యవస్థలోకి రావడం లేదు. చాలావరకు ఇళ్లకే పరిమితం అవుతున్నాయని ఓ బ్యాంక్‌ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. కాగా ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. రూ.10, రూ.20, రూ.50 నోట్లను జారీ చేయడానికి కొత్త రకమైన ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. డిమాండ్‌ను తీర్చడానికి చిన్న కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించాల్సిందిగా ఆర్‌బీఐని కోరాలని భావిస్తోంది. అలాగే పెద్ద నోట్లను డిపాజిట్‌ చేస్తే చిన్న నోట్లు, నాణేలను ఇచ్చే హైబ్రిడ్‌ ఏటీఎంలను కూడా ప్రవేశపెట్టనుంది. 

పరిశీలనలో హైబ్రిడ్‌ ఏటీఎం పనితీరు 
తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను పంపిణీ చేసే నమూనా యంత్రాలను ప్రస్తుతం ముంబైలో పైలట్‌ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నారు. ఈ ఏటీఎంలకు ఆమోదముద్ర పడితే వీటిని దేశవ్యాప్తంగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల వంటి జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ముంబై శాఖలో హైబ్రిడ్‌ ఏటీఎం పనితీరును ఆర్‌బీఐ పరిశీలించింది. ముంబై పైలట్‌ ఫలితాలను సమీక్షించడంతో పాటు ఆర్‌బీఐ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ ఏటీఎంలను బ్యాంకుల ద్వారా విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement