నిద్రలేమి.. మహిళల్లోనే ఎక్కువ! | ResMed 2026 Global Sleep Survey reveals | Sakshi
Sakshi News home page

నిద్రలేమి.. మహిళల్లోనే ఎక్కువ!

Mar 5 2026 1:14 AM | Updated on Mar 5 2026 1:14 AM

ResMed 2026 Global Sleep Survey reveals

ఒత్తిడి, కుటుంబ బాధ్యతలే ఇందుకు కారణం  

ఈ సమస్యతో తగ్గుతున్న ఏకాగ్రత, పనితీరు 

రెస్‌మెడ్‌ 2026 గ్లోబల్‌ స్లీప్‌ సర్వేలో వెల్లడి 

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: మహిళల్లో నిద్రలేమి అనేది ఒక క్లిష్టమైన ప్రజారోగ్య సమస్యగా అవతరించింది. పురుషుల కంటే మహిళలే నిద్ర విషయంలో అధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతల్లో అసమానత ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణాలు. ఫలితంగా నేటి కాలంలో చాలామంది భారతీయ మహిళలకు నాణ్యమైన నిద్ర అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. 

అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా మెడికల్‌ డివైసెస్‌ తయారీలో ఉన్న రెస్‌మెడ్‌ ఇటీవల గ్లోబల్‌ స్లీప్‌ సర్వే–2026 నిర్వహించింది. భారత్‌తోపాటు అమెరికా, చైనా, యూకే, జ ర్మనీ, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్, కొరియా, బ్రెజిల్, పోలండ్, సింగపూర్, మెక్సికో దేశాలకు చెందిన 30 వేల మంది పాలుపంచుకున్నారు. ఇందులో భారత్‌ నుంచి 5 వేల మంది ఉన్నారు. 

ఈ సర్వే ప్రకారం.. నిద్రలేమి సమస్యతో 38% మంది భారతీయ మహిళలు ఇబ్బందిపడుతున్నారు. పురుషుల విషయంలో ఈ సంఖ్య 29% మాత్రమే. వంట, ఇంటి పనులు; పిల్లలు, పెద్దల సంరక్షణ.. భారతీయ మహిళల భు జాలపై సహజంగా ఉండే భారం. ఇంటి నిర్వహణకు సంబంధించిన మానసిక ఒత్తిడి దీనికి అదనం. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే అటు వృత్తి బాధ్యతలనూ మోయాల్సి వస్తోంది.  

భిన్నమైన ప్రభావం..: సామాజిక, మానసిక ఒత్తిళ్లు స్త్రీ పురుషులపై రాత్రి నిద్ర విషయంలో ఎలా భిన్నంగా ప్రభావం చూపుతాయో ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. నిద్రాభంగం కావడానికి మానసిక ఒత్తిడి, ఆందోళనను ప్రధాన కారకాలుగా 42% మంది మహిళలు పేర్కొన్నారు. ఈ విషయంలో పురుషుల సంఖ్య 36% ఉంది. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలు నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాయని 39% మంది మహిళలు, 33% మంది పురుషులు చెబుతున్నారు. 

సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి స్థిర, నాణ్యమైన నిద్ర అవసరమని ప్రపంచవ్యాప్తంగా 90% మంది గుర్తించారు. ఆహారం, వ్యాయామంతోపాటు నిద్రను అత్యంత ముఖ్యమైన అలవాటుగా 44% మంది భారతీయులు పరిగణిస్తున్నారు. అయినప్పటికీ 53% ప్రజలు వారానికి నాలుగు రాత్రులు లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే నాణ్యమైన నిద్రను పొందుతున్నట్లు తెలిపారు. ఇది అవగాహనకు, వాస్తవానికి మధ్య పెరుగుతున్న భారీ అంతరాన్ని నొక్కి చెబుతోంది. 

వేరబుల్‌ టెక్నాలజీతో.. 
నిద్ర ప్రాముఖ్యతపై ప్రజల్లో అధిక అవగాహన ఉన్నప్పటికీ సమస్యలున్నవారు వైద్యపరంగా సాయం తీసుకోవడం లేదు. 78% మంది భారతీయులు నిద్ర సమస్యల పరిష్కారం కోసం వైద్యుడిని సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. సాధారణ చెకప్‌లలో 69% మందికి మాత్రమే దీనికి సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని ఆసుపత్రులు మరింత చురుకుగా నిద్ర సమస్యలను గుర్తించాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. 

75% మంది భారతీయులకు తమ నిద్ర విధానాలను మరింత నిశితంగా గమనించడానికి స్మార్ట్‌వాచెస్, ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌ వంటి వేరబుల్‌ టెక్నాలజీ దోహదపడుతోంది. ఈ పరికరాలు నెగిటివ్‌ ఫలితాలు చూపితే.. 66% మంది వినియోగదారులు తమ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వైద్య సలహాను పొందుతామని చెబుతున్నారు. 

మానసిక ఆరోగ్యంపై.. 
నాణ్యమైన నిద్ర తక్కువగా ఉండటం వల్ల కేవలం అలసట మాత్రమే కాకుండా అంతకుమించిన తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. సరైన నిద్రలేని రాత్రి తర్వాత తాము మరింత చిరాకుగా, ఒత్తిడితో లేదా నిరాశతో ఉన్నట్లు అత్యధికులు తెలిపారు. ప్రత్యేకించి 30% మంది నిద్రలేమికి, కుంగుబాటు లక్షణాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement