మళ్లీ బలపడిన బంధం | Sakshi Editorial On India Canada relations | Sakshi
Sakshi News home page

మళ్లీ బలపడిన బంధం

Mar 5 2026 12:45 AM | Updated on Mar 5 2026 12:45 AM

Sakshi Editorial On India Canada relations

దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఒకసారి దెబ్బతింటే అతుక్కోవటం అంత సులభం కాదు. అందుకు సుదీర్ఘ కాలం పడుతుంది. గత రెండేళ్లుగా అందుకోసం తెర వెనుక సాగిన ప్రయత్నాలన్నీ ఫలించి కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ మన దేశంలో నాలుగు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రూ. 4.65 లక్షల కోట్లకు చేరుకునేలా ఇరుదేశాలూ కృషి చేయాలన్న నిర్ణయం జరిగింది. 

అలాగే అణు విద్యుదుత్పాదన కోసం ఇప్పుడు సరఫరా చేస్తున్న యురేనియంను మరింత పెంచటానికి కెనడా అంగీకరించింది. దీని విలువ రూ. 17,403 కోట్లు. ఇవిగాక పునరుత్పాదక ఇంధన వనరులతో సహా పలు అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు... రెండూ అకారణంగా ఇరాన్‌పై విరుచుకుపడుతున్న పర్యవసానంగా పశ్చిమాసియాతో పాటు ప్రపంచమంతా అలుము కున్న అస్థిర వాతావరణం నేపథ్యంలో భారత్, కెనడా తమ సంబంధాలను మెరుగు పరుచుకోవటం మంచి సందేశం పంపుతుంది.

ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు 2023లో హతమార్చాక భారత్, కెనడాల సంబంధాలు దెబ్బతినటం నిజమే కావొచ్చు గానీ... అంతకు చాన్నాళ్లముందే అప్పటి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో అనుసరించిన విధానాలు ఇరుదేశాల మధ్యా పొరపొచ్చాలు పెంచాయి. కెనడాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న సిక్కుల ఓటుబ్యాంకు కోసం ఆయన వేర్పాటువాదులను ప్రోత్సహించారు. భారత్‌లో నేరాలు చేసి వచ్చిన వేర్పాటువాదులను అప్పగించేందుకు ఆయన ప్రభుత్వం నిరాకరించేది. 

అందుకే 2018లో ట్రుడో మన దేశం పర్యటనలో ఘనమైన స్వాగత సత్కారాలు లభించలేదు. ట్రుడోను భారత్‌ అవమానించిందంటూ కెనడా మీడియా వ్యాఖ్యానించింది కూడా! నిజ్జార్‌ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నదంటూ కెనడా ఆరోపించటం, అక్కడి మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావటం అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణించటానికి దోహదపడ్డాయి. 

వేర్పాటువాదులను ఆదరిస్తే జరిగేదేమిటో ట్రుడోకు నిరుడు ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలకు ముందే తెలిసొచ్చింది. ట్రుడో నాయకత్వం కొనసాగితే లిబరల్‌ పార్టీ ఓడిపోతుందని సర్వేలు తేల్చటంతో ఆయన రాజీనామా చేయకతప్పలేదు. అనంతరం వచ్చిన మార్క్‌ కార్నీ స్వల్పకాలంలోనే సమర్థుడిగా పేరుతెచ్చుకుని పార్టీ విజయావ కాశాలు పెంచగలిగారు. మెరుగ్గా కనబడిన విపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ వెనకబడటం మొదలైంది. ఈలోగా అమెరికాలో ట్రంప్‌ ఏలుబడి మొదలైనాక ఆయన కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకుంటామనటంతో పాటు ఏకపక్షంగా సుంకాలు విధించటం ట్రంప్‌కు సన్నిహితంగా మెలిగిన ఆ మితవాద పార్టీ ప్రాభవాన్ని దెబ్బతీసింది.

నిరుడు కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లాక దౌత్యసంబంధాలు చిగురించటం మొదలైంది. అంతక్రితం నిజ్జార్‌ వ్యవహారంలో ఆరోపణలు, దౌత్యవేత్తల పరస్పర బహిష్కరణ వంటివి జరగ్గా, నిరుడంతా ఇరుదేశాలూ హైకమిషనర్లను నియమించుకోవటం, రెండు దేశాల మధ్యా వివిధ మంత్రిత్వశాఖల స్థాయిలో సమన్వయం సాధించటం వంటివి చోటుచేసుకున్నాయి. కోవిడ్‌ మహమ్మారి కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ పల్టీలు కొడుతుండగా, ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక విధిస్తున్న సుంకాలు మరింత కుంగదీస్తున్నాయి. కెనడా కూడా చాలావిధాల దెబ్బతింది. 

ఈ పరిస్థితుల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవటం ఆ దేశానికి తప్పనిసరైంది. ఇటు మన దేశం కూడా రాగల కాలంలో విద్యుదుత్పాదనను విశేషంగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం మన అణువిద్యుదుత్పాదన 6,780 మెగావాట్లు మాత్రమే. వచ్చే దశాబ్ది ప్రారంభానికి ఇది 22,500 మెగావాట్లకు చేరాలి. 2047 నాటికి 100 గిగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తయితే తప్ప మన అవసరాలు తీరబోవన్న అంచనాలున్నాయి. పదేళ్లపాటు యురేనియం ఎగుమతి చేసేందుకు కెనడాతో కుదిరిన ఒప్పందం ఇందుకు దోహద పడుతుంది. అయితే ఇరు దేశాల మధ్యా ఇంకా అపోహలు లేకపోలేదు. కలిసి కదలటం మొదలుపెడితే, స్నేహసంబంధాలు మెరుగవుతుంటే అలాంటివి పటాపంచలవుతాయి. ఆ దిశగా కార్నీ పర్యటన ఒక ముందడుగు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement