భాషకందని భావ విన్యాసం | Sikkolu Kalankari artist was recently felicitated by the President | Sakshi
Sakshi News home page

భాషకందని భావ విన్యాసం

Mar 13 2026 4:05 AM | Updated on Mar 13 2026 4:05 AM

Sikkolu Kalankari artist was recently felicitated by the President

అపురూప కళ కలంకారీ

ఇటీవల రాష్ట్రపతి చేతులమీదుగా సత్కారం అందుకున్న సిక్కోలు కళాకారుడు

అక్షరాలు లేని కథ రాయాలి. వర్ణాలతోనే భావాలు చెప్పాలి. పరమాత్ముడి రూపానికి పవిత్రంగా జీవం పోయాలి. భారత, భాగవత గాథలు కళ్లకు కట్టినట్టు వివరించాలి. చేతిలోకి తీసుకున్న సాధారణ వస్త్రం పని పూర్తయ్యాక కళాఖండంలా మారాలి. ఇన్ని జరగాలంటే.. కళాకారులు వస్త్ర శస్త్రాలతో విన్యాసం చేయాలి. ఆ విన్యాసాల సమాహారమే కలంకారీ. వస్త్రం ఎంపిక, రంగుల తయారీ, వర్ణాల అద్దకం, భావాల వ్యక్తీకరణ..ఇలా అన్నీ అపురూప ప్రక్రియలే. ఈ మహోన్నత కళకు ఇటీవల సమున్నత గౌరవం లభించింది.    – శ్రీకాకుళం కల్చరల్‌  

పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ గాథలు, భాగవత కథలు.. ఒక వస్త్రంపై చెప్పే అపురూప కళ కలంకారీ. కలంకారీ చీరల గురించి తెలిసినంత వివరంగా కలంకారీ కళ గురించి అంతగా ఎవరికీ తెలియదు. దేశానికి ప్రముఖులు వచ్చే సందర్భాల్లోనూ, జ్ఞాపికలు ఇవ్వాల్సిన సందర్భాల్లోనూ మొదటి ఎంపిక ఈ కలంకారీ ఆకృతులే. ఈ కళలో వ్రస్తాల ఎంపిక నుంచి తుది అంకం ముగిసేంత వరకు ఓ యజ్ఞమే జరుగుతుంది.  

వస్త్రం ఎంపిక ఇలా.. 
కలంకారీ ప్రక్రియలో కాటన్‌ వ్రస్తాలను వాడుతా రు. ఈ వ్రస్తాన్ని ముందురోజు రాత్రి నీళ్లలో నానబెడతారు. మరుసటి రోజు ఆ గుడ్డను బాగా ఉతికి దానిలో ఉన్న గంజిని పూర్తిగా తీసివేస్తారు. తర్వాత పాలు, కరక్కాయ మిశ్రమాన్ని తయారు చేసి, ఆ మిశ్రమంలో ఈ కాటన్‌ గుడ్డను బాగా ముంచి దానికి కరక్కాయ–పాలు మిశ్రమం బాగా పట్టుకునేలా రుద్దుతారు. ఆ తర్వాత గుడ్డను పిండి అందులో ఉన్న అదనపు మిశ్రమాన్ని తీసివేసి ఎండలో ఆరనిస్తారు. గుడ్డ బాగా ఆరిన తర్వాత నుంచి కుంచె ప్రక్రియ ప్రారంభిస్తారు.  

సహజ రంగులు మాత్రమే.. 
ఈ కళలో సహజమైన మొక్కలు, ఖనిజాల నుంచి తీసిన రంగులను మాత్రమే ఉపయోగిస్తారు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు, నలుపు, గోధుమ రంగులు ప్రధానమైనవి. ఈ రంగులు బట్టలకు స్థిరంగా ఉండటానికి పటిక, ఇనుప రేకుల వంటి సహజసిద్ధమైన వాటిని ఉపయోగిస్తారు. ఎరుపు రంగును మాడర్‌ చెట్ల బెరడు లేదా పటిక, బెల్లం నీటి మిశ్రమం నుంచి తయారు చేస్తారు. నలుపును ఇనుప తుప్పు, బెల్లం మిశ్రమం ద్వారా చేస్తారు.

పసుపును.. 
పసుపు, దానిమ్మ తొక్కలు  నుంచి తయారు చేస్తారు. 
నీలం రంగును.. 
నీలిమందు మొక్క నుంచి తయారు చేస్తారు. 
ఆకుపచ్చ రంగును .. 
నీలిమందు, పసుపు రంగులను కలపడం ద్వారా తయారు చేస్తారు. 
గోధుమ/మట్టి రంగులను.. 
కాశీ, ఇతర సహజ పదార్థాల నుంచి తీసుకుంటారు. సింథటిక్‌ రంగులు అస్సలు ఉపయోగించరు.స్త్రీల చిత్రాలకు పసుపు, దేవతల చిత్రాలకు నీలం, రాక్ష­సుల చిత్రాలకు ఎరుపు / ఆకుపచ్చ రంగులు వాడతారు. 

మన కళాకారుడు ధను 
శ్రీకాకుళానికి చెందిన ధను అండ్లూరి ఈ కలంకారీ కళలో రాణిస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి నుంచి  ప్రశంసలు కూడా అందుకున్నారు. ధనుంజయ్‌ పుట్టింది పెరిగింది శ్రీకాకుళంలోనే. తండ్రి జగదీశ్వర్‌ రావు ఆర్టీసీ మెకానిక్‌. ధనుకు చిన్ననాటి నుంచి కళలంటే మక్కువ. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆ దిశగా ప్రోత్సహించారు.చదువు కూడా అదే రీతిలో కొనసాగింది. 

కలంకారీ పెయింటింగ్‌లో డిప్లమాతో పాటు శిల్ప కళలోనూ ఆయన డిగ్రీలు పొందారు. ‘వైభవ గోవింద’ కళాఖండానికి 2019లో టీటీడీ చైర్మన్‌ చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. ‘కృష్ణలీల’ చిత్రానికి గాను 2016లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి స్టేట్‌ హ్యాండీక్రాఫ్ట్‌ అవార్డు తీసుకున్నారు.   

కలమిదే.. 
ఈ కళలో ఉపయోగించే కలం(కుంచె) చాలా ప్రత్యేకం. వెదురు పుల్లకు, కమ్మలె (లేదా పత్తి) ముక్కను అమర్చి, దారంతో బాగా చుట్టి తయారు చేసే ప్రత్యేకమైన బ్రష్‌ ఇది. మనకు కావాల్సిన విధంగా ఈ బ్రష్‌ను చేతితోనే తయారు చేస్తారు.

ఎలా వేస్తారంటే..?
» వస్త్రాన్ని పాలు–కరక్కాయ మిశ్రమంలో ముంచే ప్రక్రియలన్నీ ముగిశాక కుంచె సహాయంతో నలుపు రంగును ఉపయోగించి, ముందుగా సిద్ధం చేసిన రంగుతో గీయాల్సిన బొమ్మలు, చిత్రాలను గీయడం ప్రారంభిస్తారు. 
» నలుపు రంగుతో చిత్రాలు పూర్తయ్యిన తర్వాత, ఆ గుడ్డను పారే నీళ్లలో అంటే నది లేదా నీరు పారే కాలువ దగ్గర ముంచి కడుగుతారు. 
» ఇలా చేయడం వల్ల గుడ్డపై ఎక్కువగా ఉన్న నలుపు రంగు వదిలిపోతుంది.
» తర్వాత, మరుసటి రోజు ఎరుపు రంగు ప్రక్రియను ప్రారంభిస్తారు. 
» గుడ్డను మళ్లీ పాలు, కరక్కాయ మిశ్రమంలో పిండి సిద్ధం చేస్తారు. 
» తర్వాత స్పటికం లేదా పటిక (అలమ్‌) ను పొడి చేసి నీళ్లలో కలిపి, ఎక్కడైతే ఎరుపు రంగు రావాలో అక్కడ ఆ నీటిని అద్దుతారు. ఆ తర్వాత ఆరిన గుడ్డను బాయిలింగ్‌ ప్రక్రియకు తీసుకెళ్తారు. 
» ఒక పెద్ద కుండలో నీళ్లు పోసి బాగా మరిగిస్తారు. ఆ మరుగుతున్న నీళ్లలో చావలికొడి, మంజిష్ట, సురుడు చెక్క వంటి చెట్ల వేర్లను వేస్తారు. 
» అప్పుడు ఆ నీరు క్రమంగా ఎరుపు రంగులోకి మారుతుంది.
» అందులో ముందుగా పటికతో రాసిన గుడ్డను ముంచి తీసినప్పుడు, ఎక్కడైతే పటిక రాసి ఉంటుందో అక్కడ ఎరుపు రంగు బాగా పడుతుంది.
» తర్వాత ఆ గుడ్డను మళ్లీ చల్లని నీళ్లలో ఉతికి, పారే నీళ్లలో బాగా కడుగుతారు.
» దీంతో అదనపు రంగు పోయి గుడ్డపై నలుపు, ఎరుపు రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. 
» ఆ తర్వాతి రోజు గుడ్డను మళ్లీ పాలలో పిండి సిద్ధం చేసి, ఆపై పసుపు, నీలం, పచ్చ వంటి ఇతర సహజ రంగులను వేస్తారు. 
» చివరిగా మళ్లీ వేడి నీళ్లలో బాయిలింగ్‌ ప్రక్రియ చేసి కలంకారి చిత్రాన్ని పూర్తిచేస్తారు. దాదాపు పదిహేను రోజుల పాటు ఈ ప్రక్రియ సాగుతుంది.   

ఈ గౌరవం చిరస్మరణీయం 
రాష్ట్రపతి చేతులమీదుగా స్మారకం అందుకోవడం చిరస్మరణీయ ఘట్టం. దేశ అత్యున్నత స్థాయిలో కలంకారీ కళకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం.   – ధను అండ్లూరి, కలంకారీ కళాకారుడు, శ్రీకాకుళం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement