ఐపీఓ రివర్స్‌ గేర్‌! | India IPO Market Faces Slowdown 2026 | Sakshi
Sakshi News home page

ఐపీఓ రివర్స్‌ గేర్‌!

Feb 27 2026 5:58 AM | Updated on Feb 27 2026 9:01 AM

India IPO Market Faces Slowdown 2026

ఇన్వెస్టర్లకు ఈ ఏడాది నిరాశే... 

కొత్తగా లిస్టయిన 32 షేర్లలో 60% నేల చూపులు.. 

ఇష్యూ ధర కంటే దిగువకు... 

11 కంపెనీలు డిస్కౌంట్‌ ధరలో అరంగేట్రం 

కళతప్పుతున్న ప్రైమరీ మార్కెట్‌... 

గత రెండు మూడేళ్లుగా రికార్డుల హోరుతో దలాల్‌ స్ట్రీట్‌లో దుమ్మురేపిన ఐపీఓ మార్కెట్‌.. కొత్త ఏడాదిలో కళతప్పుతోంది. ఈ ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీల షేర్లలో చాలా వరకు ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయి ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. అంతేకాదు, అరంగేట్రంలో తుస్సుమనిపిస్తుండటంతో లిస్టింగ్‌ లాభాల కోసం ప్రైమరీ మార్కెట్‌ వెంటపడే మదుపరులకు నిరాశ తప్పడం లేదు.

ఏదైనా కంపెనీ ఐపీఓకు వస్తోందంటే మార్కెట్లో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలెత్తేది. బంపర్‌ లిస్టింగ్‌లతో ఇన్వెస్టర్లకు లాభాల పంటే. మరిప్పుడో.. లాభాల సంగతి అటుంచితే.. ఎరక్కపోయి ఇరుక్కుపోయాం అంటూ ఇన్వెస్టర్లు గగ్గోలు పెట్టే పరిస్థితి. 2026లో ఇప్పటిదాకా ప్రధాన ఎక్సే్చంజీల తో పాటు ఎస్‌ఎంఈ ప్లా ట్‌ఫామ్‌లో 32 కంపెనీ లు నిధుల సమీకరణ చేపట్టాయి. ఇందులో 11 కంపెనీలు నష్టా లతో అరంగేట్రం చేశాయి. 21 కంపెనీలు లాభాలతో లిస్టయినప్పటికీ.. చివరికి తొలిరోజున లాస్‌లోనే ముగిశాయి. అన్నింటికంటే అందోళనకరమైన అంశం ఏంటంటే.. 60% (19) కంపెనీల షేర్లు ఇప్పుడు ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోవడం రివర్స్‌ ట్రెండ్‌కు అద్దం పడుతోంది.

గతేడాది ఘనం... 
ఈ ఏడాది ఇప్పటిదాకా ప్రీమియంతో లిస్టయిన 21 కంపెనీల్లో కేవలం 8 కంపెనీల షేర్లు మాత్రమే రెండంకెల్లో లాభాలు అందించాయి. గతేడాది ఇదే కాలంలో 18 స్టాక్స్‌ రెండంకెల వృద్ధితో అరంగేట్రం చేశాయి. మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్‌ను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో సగటు లిస్టింగ్‌ లాభం 8% కావడం దీనికి నిదర్శనం.  కాగా, ఎస్‌ఎంఈ విభాగంలో లిస్టయిన అన్ని రంగాల్లోనూ ఈ ఏడాది ప్రతికూల పనితీరు కనబడుతోంది. అన్నింటికంటే తీవ్రంగా యజూర్‌ ఫైబర్స్‌ షేరు ఐపీఓ ధరతో పోలిస్తే 70 శాతం దిగువన ట్రేడవుతోంది. అరిటాస్‌ వినైల్, నర్మదేష్‌ బ్రాస్‌ ఇండస్ట్రీస్, విక్టరీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్, ఆర్మర్‌ సెక్యూరిటీ, కనిష్క్‌ అల్యూమినియం షేర్లు ఇష్యూ ధరతో పోలిస్తే 42%–66% కిందికి జారడం ఎస్‌ఎంఈ కౌంటర్లో కరెక్షన్‌ తీవ్రతను సూచిస్తోంది. 

ప్రధాన ఇష్యూలు అంతంతే.. 
ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ప్రధాన ఎక్సే్చంజీల్లో (మెయిన్‌ బోర్డ్‌) ఐపీఓల జోరు కూడా తగ్గింది. కేవలం 5 కంపెనీలు మాత్రమే లిస్టింగ్‌ బాట పట్టాయి. ఇందులో కేవలం రెండు కంపెనీలు.. భారత్‌ కోకింగ్‌ కోల్‌ (44.6% లాభం), అమాగీ మీడియా ల్యాబ్స్‌ (6.9%) మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇష్యూ ధరతో పోలిస్తే ఫ్రాక్టల్‌ ఎనలిటిక్స్‌ 10.1%, ఆయ్‌ ఫైనాన్స్‌ 1% షాడోఫ్యాక్స్‌ టెక్నాలజీస్‌ 4.3% నష్టాల్లో ఉన్నాయి. కాగా, 2025 తొలి రెండు నెలల్లో 50 లిస్టింగ్‌లు నమోదు కాగా, ఈ ఏడాది 32 ఇష్యూలు మార్కెట్లను తాకాయి. పబ్లిక్‌ ఆఫర్ల పరంగా 2025లో రికార్డుల మోత మోగింది. ఏకంగా 373 ఐపీఓలు వరుసకట్టాయి. ఇందులో 270 ఎస్‌ఎంఈ ఇష్యూలు కాగా, 103 మెయిన్‌ బోర్డ్‌ లిస్టింగ్‌లు ఉన్నాయి. అయితే, 2024లో అత్యధికంగా సగటు లిస్టింగ్‌ లాభాలు 49% నమోదయ్యాయి. 2025లో ఇది 10.6 శాతంగా ఉంది.

మెరుపులు రెండే.. 
మొత్తం 32 లిస్టెడ్‌ కంపెనీల్లో 13 స్టాక్స్‌ మాత్రమే ఇష్యూ ధరపైన కదలాడుతున్నాయి. ఇందులో గ్రోవర్‌ జ్యుయెల్స్‌ ఐపీఓ ఇన్వెస్టర్లకు 95 శాతం లాభాలను పంచింది. కేఆర్‌ఎం ఆయుర్వేద, అక్రిషన్‌ న్యూట్రేవేద, భారత్‌ కోకింగ్‌ కోల్‌ వరుసగా 52%, 49%, 45% చొప్పున దూసుకెళ్లాయి. భారత్‌ కోకింగ్‌ కోల్‌ (97.5%), ఈ టూ ఈ ట్రాన్స్‌పోర్టేషన్‌ (90%).. లిస్టింగ్‌లో జిగేల్‌మన్నవి ఈ రెండే. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో లిస్టింగ్‌లను చూస్తే, ఆరు కంపెనీల షేర్లు 90% పైగా ప్రీమియంతో బంపర్‌ లాభాలందించడం విశేషం.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌
 

Advertisement
 
Advertisement
Advertisement