బాలీవుడ్ దిగ్గజ నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు.. నటుడు, దర్శకుడు అయిన సునీల్ ఆనంద్ (70) చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన మేనకోడలు జీనా నారంగ్.. కుటుంబ సభ్యుల తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
(ఇదీ చదవండి: రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)
అమెరికా నుంచి భారత్కి తిరిగొస్తుండగా లండన్లో సునీల్ ఆనంద్కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షల తర్వాత స్టెంట్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుండగా.. సర్జరీకి ముందే ఈయనకు మరోసారి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తుదిశ్వాస విడిచారు. గతంలో తండ్రి దేవ్ ఆనంద్ ఏ ఆస్పత్రిలో అయితే చనిపోయారో అదే చోట ఇప్పుడు కొడుకు సునీల్ ఆనంద్ కూడా మరణించారు.
1984లో తండ్రి దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'ఆనంద్ ఔర్ ఆనంద్' సినిమాతో సునీల్ ఆనంద్.. హీరోగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత 'కార్ థీఫ్', 'మైన్ తేరే లియే', 'మాస్టర్' తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.
అయితే 2023లో తన తండ్రి 100వ జయంతి వేడుకల్లో మాట్లాడిన సునీల్ ఆనంద్.. నా జీవితంలో 40 ఏళ్లకు పైగా తండ్రి ఆరోగ్యం, షూటింగ్ షెడ్యూల్స్, కుటుంబ నిర్మాణ సంస్థ నవకేతన్ ఫిలిమ్స్ వ్యవహారాలని చూసుకున్నానని చెప్పారు. తన తండ్రి జీవితానికి అంకితమిచ్చేలా ఓ భారీ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఇప్పుడు సునీల్ ఆనంద్ తుదిశ్వాస విడిచారు.
(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)


