హీరో రామ్ చరణ్.. 'పెద్ది' షూటింగ్లో గాయపడ్డాడు. చేతికి కట్టుతోనే ప్రమోషన్లలోనూ పాల్గొన్నాడు. ఇన్నాళ్లకు అంటే నిన్న(జూలై 27) కోయంబత్తూరులో గంగా ఆస్పత్రిలో చరణ్ మణికట్టుకు సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమని తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభించాలని వైద్యులు సూచించారు. అయితే చరణ్ భార్య ఉపాసనకు సంబంధించి హైదరాబాద్లోనే అపోలో, కామినేని ఆస్పత్రులు ఉండగా.. కోయంబత్తూరు వరకు ఎందుకు వెళ్లారా అని సందేహం రావొచ్చు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ 'మైఖేల్'.. అధికారిక ప్రకటన)
కోయంబత్తూరులోని గంగా ఆస్పత్రికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థోపెడిక్స్, హ్యాండ్, మైక్రోవాస్క్యులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి మంచి పేరు ఉంది. ముఖ్యంగా చేతివేళ్లు, మణికట్టు, నరాలు, ఎముకలు, కండరాలు లాంటి క్లిష్టమైన సమస్యలని పరిష్కరించడంలో ఈ ఆస్పత్రి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అందుకే చరణ్.. దీనిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
డాక్టర్ రాజశేఖరన్ నేతృత్వంలో అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు డా.అలెజాండ్రో బాడియా బృందం, డా.ప్రవీణ్ భరద్వాజ్ శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. సో అదన్నమాట సంగతి. ప్రస్తుతానికైతే చరణ్ కొత్త సినిమాలేం చేయట్లేదు. సుకుమార్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నప్పటికీ.. షూటింగ్ మొదలయ్యేసరికి మరో ఆరేడు నెలలైనా పట్టొచ్చని సమాచారం.
ఇక సర్జరీ విజయవంతమైన నేపథ్యంలో 'పెద్ది' నిర్మాణ సంస్థ.. చరణ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది. మణికట్టు శస్త్రచికిత్స విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది. గాయంతోనే ఆయన 'పెద్ది' షూట్ కొనసాగించారు. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారు. సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధత, పట్టుదల, మా టీమ్కి స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాం అని రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: నచ్చలేదా వదిలేయ్... రూ.1 కూడా ఖర్చు పెట్టకు: అల్లు అర్జున్)


