‘‘ఇలాంటి సినిమాలో నువ్వు నటించాలి’’ అని తన కుమార్తె జాన్వీ కపూర్తో గతంలో శ్రీదేవి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో జాన్వీయే తెలిపారు. అది ఏ సినిమా అంటే... నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించిన మరాఠీ మూవీ ‘సైరత్’ (2016). శ్రీదేవి ఆకాంక్ష నెరవేరి, సరిగ్గా ఈ చిత్రం హిందీ రీమేక్ ‘ధడక్’లో నటించే చాన్స్ జాన్వీకి దక్కింది. ఈ చిత్రానికి శశాంక్ ఖేతన్ దర్శకత్వం వహించారు.
అయితే తెర మీద ఈ సినిమాని చూడకుండానే 2018లో ఫిబ్రవరిలో శ్రీదేవి మరణించారు. ‘ధడక్’ 2018 జూలై 20న విడుదల కావడం, మరాఠీలోలానే హిందీలో సూపర్ హిట్ కావడం జరిగింది. ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకంటే... ‘సైరత్’ రీమేక్ ద్వారా కథానాయికగా పరిచయమైన జాన్వీ ఆ చిత్రదర్శకుడు నాగరాజ్ మంజులేతో సినిమా చేయనున్నారట. ఈ ఇద్దరి మధ్య తమ కాంబినేషన్ సినిమాకి సంబంధించిన కథాచర్చలు జరిగాయని టాక్. అన్నీ కుదిరితే త్వరలో ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని సమాచారం.


