సర్కారుకు కర్షక నేతల వినతి
బనశంకరి(బెంగుళూరు): యువ రైతులను వివాహం చేసుకునే యువతులకు రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని, బడ్జెట్లో రైతులకు సాయం ప్రకటించాలని రైతు సంఘాలు సీఎం సిద్దరామయ్యను కోరాయి. మంగళవారం విధాసౌధలో రైతుసంఘాల నాయకులతో సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం జరిపారు. రైతు నేతలు మాట్లాడుతూ యువ రైతులకు పిల్లనిచ్చే వారు లేకపోవడం సామాజిక విషాదమన్నారు. కాబట్టి యువ రైతులను పెళ్లాడే వధువుకు ప్రభుత్వం కనీసం రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలన్నారు.
రైతులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడానికి రూ.20 వేల కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. రైతుల భూముల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కిసాన్ సమ్మాన్ పథకాన్ని మళ్లీ అమలు చేసి రైతులకు ఆర్థిక సాయం చేయాలన్నారు. చెరువులను అభివృద్ధి చేయాలి, రుణ సదుపాయం పెంచాలి, నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించేలా సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు.


