‘మార్షల్ లా’ కేసులో సియోల్
సెంట్రల్ జిల్లా కోర్టు తీర్పు
మరికొందరు అధికారులు
సైతం జైలుశిక్ష
సియోల్: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు సియోల్ సెంట్రల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. 2024 డిసెంబర్ 3న అధ్యక్షుడిగా అధికారంలో ఉన్న సమయంలో దేశంలో మార్షల్ లా విధించి, ప్రజల హక్కులు విఘాతం కలిగించిన కేసులో తీర్పు వెలువరించింది.
ప్రతిపక్షాలపై ఆధిపత్యం సాధించడానికి గాను జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)ని చుట్టుముట్టడానికి సైన్యాన్ని పంపించడంతోపాటు ప్రత్యర్థులను అరెస్టు చేయడానికి, నియంత్రణలేని అధికారం చలాయించడానికి సైన్యాన్ని, పోలీసులను రంగంలోకి దించి, బల ప్రయోగం చేసినందుకు తిరుగుబాటు చర్య కింద యూన్ సుక్ను దోషిగా నిర్ధారించినట్లు సెంట్రల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి జీ కూయూన్ వెల్లడించారు.
ప్రతిపక్ష నాయకులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తూ యూన్ సుక్ యోల్ మార్షల్ లా విధించారు. దేశంలో రాజకీయ కార్యకలాపాలను రద్దుచేశారు. మీడియా, ప్రచురణ సంస్థలను తన ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టులు చేసేందుకు పోలీసులు అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
దక్షిణ కొరియాలో నాలుగు దశాబ్దాల తర్వాత మార్షల్ లా అమల్లోకి వచ్చింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించారు. దాంతో ఆరు గంటల్లోనే మార్షల్ లా ముగిసింది. తర్వాత యూన్ సుక్ యోల్ అభిశంసనకు గురయ్యారు. 2024 డిసెంబర్ 14న పదవి కోల్పోయారు. ఆయనను పదవి నుంచి తప్పిస్తూ 2025 ఏప్రిల్లో రాజ్యాంగ కోర్టు అధికారికంగా ఉత్తర్వు జారీ చేసింది. యూన్ సుక్ యోల్పై పలు అభియోగాలు నమోదయ్యాయి.
గత ఏడాది జూలైలో అరెస్టయ్యారు. విచారణను ఎదుర్కొంటున్నారు. ‘దేశంపై తిరుగుబాటు’ నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు పడింది. ‘మార్షల్ లా’ అమలులో భాగమైన మాజీ సైనికులు, పోలీసు అధికారులకు కోర్టు జైలుశిక్ష విధించింది. దక్షిణ కొరియా రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ హూన్కు 30 ఏళ్ల జైలుశిక్ష ఖరారయ్యింది. అయితే, తనకు విధించిన జీవిత ఖైదు శిక్షను యూన్ సుక్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసే అవకాశం ఉంది. దక్షిణ కొరియాలో జీవిత ఖైదు శిక్ష పడిన మొట్టమొదటి మాజీ అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ రికార్డుకెక్కారు.


