నేటి నుంచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండలంలోని గొల్లవిల్లి భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం అరిగెల రంగయ్య (ఏఎస్ఆర్) జాతీయ స్థాయి డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను ఏఎస్ఆర్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కమిటీ సభ్యులు శనివారం వెల్లడించారు. ఈ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ఆయా రాష్ట్రాల నుంచి వుమెన్, మెన్ క్రీడాకారులు పాల్గొని సత్తా చాటనున్నారు. ఈ క్రీడల్లో మెన్స్ టీమ్ నుంచి ఎస్ఏఐ కేరళ, జీఎస్టీ ముంబై, ఇండియన్ బ్యాంక్ చైన్నె, కర్ణాటక, ఐఓబీ చైన్నె, టీమ్ ఆంధ్రప్రదేశ్, వుమెన్స్ టీమ్ నుంచి ఆల్పోన్సా కేరళ, సౌత్రన్ రైల్వే చైన్నె ఎస్ఆర్ఎం చెంగలపట్టు, ఎస్సీఆర్ సికింద్రాబాద్ టీమ్లు తలపడనున్నాయి.
ప్రోత్సహిస్తున్న గొల్లవిల్లి
గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వాలీబాల్ పోటీలను ప్రోత్సహించడంలో గొల్లవిల్లి గ్రామం ముందుంటుంది. తొలుత 1987వ సంవత్సరంలో ఉండ్రు సాంబశివరావు మెమోరియల్ కోనసీమ స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. 1988లో కొనసాగగా 1989వ సంవత్సరంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో రెండు సంవత్సరాలు కొనసాగించారు. 1991, 1992 సంవత్సరాల్లో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో నిర్వహించారు. 1993 నుంచి 1995 వరకూ ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణ జిల్లాల స్థాయిలో నిర్వహించారు. 1996లో రాష్ట్ర స్థాయి పోటీలను జరిపారు. ఇదే రాష్ట్రస్థాయి పోటీలను 2000 నుంచి 2002 వరకూ మూడు సంవత్సరాలు కొనసాగించారు. 2006లో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. మళ్లీ 2010 నుంచి 2012 వరకూ మూడు సంవత్సరాలపాటు సలాది పల్లంరాజు మెమోరియల్స్ (ఎస్పీఆర్) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించారు. అనంతరం 2014 నుంచి 2017 వరకూ నాలుగు సంవత్సరాల పాటు నిమ్మకాయల వెంకటరంగయ్య (ఎన్వీఆర్) వాలీబాల్ టోర్నీ ఆధ్వర్యంలో నాలుగేళ్లపాటు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను ఘనంగా నిర్వహించారు. 2025 నుంచి అరిగెల రంగయ్య వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.


