వాడపల్లిలో వైభవంగా శ్రీపుష్పోత్సవం
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీపుష్పోత్సవం వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలతో, సర్వాలంకారభూషితులై, నవ దంపతులుగా కొలువుదీరిన స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని పులకించిపోయారు. వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు పర్యవేక్షణలో అర్చకులు, పండితులు ఉదయం స్వామివారి మేలుకొలుపు, విశేషార్చన, నిత్య హోమాలు, బలిహరణం, ద్రవిడ వేద పారాయణ తదితర వైదిక క్రతువులు నిర్వహించారు. పల్లకీ ఉత్సవం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశ ఫల నివేదనలు, ప్రసాద నివేదనలు చేశారు. కల్యాణతిలకం దిద్దుకుని నూత్న శోభతో మెరిసిపోతున్న స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఆలయంలో సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన పాన్పుపై భక్తజనరంజకంగా ఆగమ శాస్త్రానుసారం శ్రీపుష్పోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, అర్చక కమిటీ సభ్యులు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యులు శిష్ల్టా సూర్యకుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. భక్తుల ఏర్పాట్లను ఈఓ సూర్యచక్రధరరావు పర్యవేక్షించారు. ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


