ఆత్రేయపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం ర్యాలిలో శ్రీ జగన్మోహినీ కేశవస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీపుష్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, వేద పారాయణ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ద్వాదశ ప్రదక్షిణాలు, అనంతరం శ్రీపుష్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సుగంధభరిత పుష్పాలు, రకరకాల పండ్లు, మిఠాయిలు స్వామి, అమ్మవారి చెంతన ఉంచారు. శ్రీపుష్పోత్సవ వేళ ఆలయం నూతన శోభను సంతరించుకుంది. సాయంత్రం జాతీయ స్థాయి కళాకారిణి రావి బేబీ సత్యవాణి కూచిపూడి ప్రదర్శించిన నృత్యం భక్తులను అలరించింది. అనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, సభ్యులు, ఈఓ భాగవతుల వెంకట రమణమూర్తి పర్యవేక్షించారు.


