అమలాపురం టౌన్: అమరావతి పేరుతో జరుగుతున్న యుద్ధంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి ఎన్నటికీ ఉండదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై యుద్ధంలో ఎలా గెలవలేరో జగన్ మీద చంద్రబాబు కూడా గెలవలేరని చెప్పారు. స్థానిక హైస్కూల్ సెంటర్లోని తన క్యాంపు కార్యాలయంలో సూర్యనారాయణరావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అమరావతికి శాశ్వత రాజధానిగా గుర్తింపు తీసుకురావడం, అరచేతిలో స్వర్గాన్ని చూపించినట్లుగా చెబుతున్న కలల రాజధాని అమరావతికి లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందేలా చేయడం కాదని.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు రావాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అమరావతిలో ఇప్పటి వరకూ రూ.5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయిందని అన్నారు. గతంలో అమరావతి రాజధాని పేరిట రైతుల నుంచి 34 వేల ఎకరాలు సేకరించి, వారికి త్రీ బెడ్ రూమ్ ఇళ్ల ప్లాట్లు, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అదిస్తామంటూ వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ ఆ హామీ నెరవేరలేదన్నారు. ఇచ్చిన వాగ్దానాలనే అమలు చేయలేని చంద్రబాబు రూ.2 లక్షల కోట్లతో ప్రపంచం మెచ్చే రీతిలో అమరావతిని ఏవిధంగా, ఎప్పటికి రాజధానిగా నిర్మిస్తారని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్లోనే ఉండే అవకాశం ఉన్నప్పటికీ వెనువెంటనే అమరావతికి తరలిరావడం, ఆ సమయంలో రైతుల నుంచి పథకం ప్రకారం వేలాది ఎకరాలు సేకరించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో ఇచ్చిన హామీలను అప్పటి, నేటి కేంద్ర ప్రభుత్వాల పెద్దలు ఎందుకు నెరవేర్చడం లేదని, దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారని సూర్యనారాయణరావు ప్రశ్నించారు.
ఫ రాజధానికి గుర్తింపు కాదు..
ప్రత్యేక హోదా తీసుకురండి
ఫ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు


