హాకీ పోటీల్లో విజేత ఎన్సీఓఈ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆటల్లో గెలుపు ఓటములు కన్నా క్రీడా స్ఫూర్తి ప్రదానమని రాజమహేంద్రవరం, కాకినాడ రేంజ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ప్రతాప్సింగ్ భూక్య అన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 4 నుంచి జరుగుతున్న మొదటి కోకనాడ గోల్డ్కప్ జాతీయ స్థాయి మహిళా విభాగ పోటీలు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాప్సింగ్ భూక్య, అతిథులుగా డీఈఓ రమేష్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్కే చక్రవర్తి, డీఎస్డీఓ సతీష్ కుమార్, మాజీ అంతర్జాతీయ క్రీడాకారుడు దాసరి మురళీకృష్ణ, మెడికవర్ హెడ్ ఎం.అంజనేయస్వామి హాజరయ్యారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కె.రవిచంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. హాకీ మహిళల ఫైనల్స్లో హర్యానా, ఎన్సీఓఈ సోనిపట్ జట్లు పోటీ పడగా 2–1 స్కోర్తో ఎన్సీఓఈ విజయం సాధించింది. సాయిభోపాల్, యూనియన్ బ్యాంక్ జట్లు పోటీ పడగా 5–1 స్కోర్తో సాయిభోపాల్ జట్టు విజయం సాధించి మూడో స్థానాన్ని అందుకుంది. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఇండియన్ హాకీ టీం కెప్టెన్ ప్రీతమ్ శివాజ్, అసిస్టెంట్ టోర్నమెంట్ డైరెక్టర్ అజయ్ శర్మ, ఏపీ హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు బాబ్జీ, పీడీలు సూరిబాబు, హరిబాబు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


