బ్మాడ్మింటన్ పోటీలు ప్రారంభం
అమలాపురం టౌన్: పట్టుదల, క్రమశిక్షణతో బ్యాడ్మింటన్ క్రీడలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఔత్సాహిక క్రీడాకారులకు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ సూచించారు. ఆయన తండ్రి స్పోర్ట్స్ లెజెండ్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం పేరుతో కాశి బ్యాడ్మింటర్ అకాడమి ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఓపెన్, ఇన్విటేషన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ఇన్డోర్ స్టేడియంలో శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో సాత్విక్ సాయిరాజ్ మాట్లాడారు. పోటీలను రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి ప్రారంభించారు. సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడాకారుడిగా తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగం మన రాష్ట్రంలో వచ్చేలా చేయాలని సభా ముఖంగా అంకమ్మ చౌదరికి విజ్ఞిప్తి చేశారు. ఈ పోటీలు ఆదివారం కూడా కొనసాగుతాయని టోర్నమెంట్ నిర్వాహకుడు దివంగత కాశి పెద్ద కుమారుడు చరణ్ తేజ తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి టోర్నమెంట్లో తలపడేందుకు 85 టీమ్లు అమలాపురానికి వచ్చాయి. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది.


