రేపటి నుంచి సత్యదేవునికి కోటి తులసి పత్రి పూజ
అన్నవరం: ఈ నెల ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు సత్యదేవుని సన్నిధిలో జరగనున్న కోటి తులసి పత్రి పూజకు సుమారు వంద బస్తాల తులసి అవసరమని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తులసిని తీసుకువస్తున్నారు. ఈ పది రోజులు రెండు పూటలా రోజూ 11 లక్షల తులసి దళాలు అవసరమవుతాయని వివరించారు. దాత వీర్ల రాంబాబు సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి ఈ తులసిని సేకరిస్తున్నట్లు ఏఈఓ అనకాపల్లి ప్రసాద్ తెలిపారు. ఈ తులసిని భద్రపర్చడానికి ఈఓ వేండ్ర త్రినాథరావు ఆదేశాల మేరకు వ్రతాల విభాగంలోని కోల్డ్ స్టోరేజీ యూనిట్ను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తులసిని అక్కడ నిల్వ చేసి అక్కడ నుంచి అవసరమైన తులసి దళాలను పూజ కార్యక్రమం జరిగే వార్షిక కల్యాణ మండపానికి తీసుకురానున్నారు. కొమ్మలు, రెమ్మలుగా ఉన్న తులసిని విడదీసి దళాలుగా చేయడానికి 50 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలను నియమించారు.
రూ.రెండు లక్షల విరాళం
సత్యదేవునికి నిర్వహించనున్న ‘కోటి తులసి పత్రి పూజ’కు విశాఖపట్నంలోని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ రూ.రెండు లక్షల విరాళాన్ని అందజేశారు. పూజలో పాల్గొనే రుత్విక్కులు 40 మంది, వేదపండితులు, అర్చకులు మరో 20 మందితో కలిపి మొత్తం వంద మందికి మూడు పూటలా భోజనం, ఫలహారం ఏర్పాటు చేసే భాధ్యతలను దేవస్థానం వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు ఛామర్తి కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మకు అప్పగించారు. తునికి చెందిన దాత చక్కా సూర్యనారాయణ (తాతబాబు) నిర్మించిన నివేదన శాలలో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపటి నుంచి సత్యదేవునికి కోటి తులసి పత్రి పూజ


