స్పైరులీనాలో పోషకాలు మెండు
● నాచు తయారీ కేంద్రాన్ని
పరిశీలించిన కలెక్టర్
● యువకుడికి అభినందనలు
పి.గన్నవరం: స్పైరులీనా ఉత్పత్తులను అత్యంత పోషక విలువలున్న ఆహారాల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. మండలంలోని మానేపల్లి గ్రామంలో స్పైరులీనా నాచు తయారీ యూనిట్ను బుధవారం ఆయన సందర్శించి దాని తయారీ విధానాన్ని నిర్వాహకుడు బోకేశవ సత్యశ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం వద్దనుకుని స్వగ్రామంలోనే ఉపాధికి బాట వేసుకోవాలన్న లక్ష్యంతో ఈ యూనిట్ను నెలకొల్పారన్నారు. ఆక్వా రంగంలో చేపలు, రొయ్యల చెరువుల్లో వాడే మేతలో దీనిని కలపడం ద్వారా వాటి ఉత్పత్తి బాగా పెరుగుతుందన్నారు. రెండు ట్యాంకులతో పాటు ఫిల్టర్ యూనిట్లు నెలకొల్పేందుకు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారన్నారు. ఒక్కొక్క ట్యాంకులో రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కళ్లు ఉప్పు, 10 కిలోల సోడియం బైకార్బొనేట్ కలిపి, తద్వారా రోజుకు 80 కిలోల తడి నాచును ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. దీనిని ఆక్వా రైతులకు కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నానని, పది కిలోల తడినాచు ఎండబెడితే కిలో పొడి నాచు తయారవుతుందని, దీనిని కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నట్టు వివరించారు. స్పైరులీనా నాచుకు రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ వివరించారు. యూనిట్ నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ స్పైరులీనా అత్యధిక పోషక విలువలు కలిగిన నీలి–ఆకుపచ్చ పదార్థమని, దీనిని సూపర్ ఫుడ్గా పిలుస్తారన్నారు. దీనిని పశువుల మేతలో వినియోగిస్తే నాణ్యమైన పాలతో పాటు, పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పితాని చంద్రకళ, పితాని నరసింహరావు, డీటీ సత్యనారాయణ, ఆర్ఐ వెన్నపు డాంగే తదితరులు పాల్గొన్నారు.


